క్రీడలలో గెలుపు ఓటములు సహజమని, క్రీడలతో స్నేహభావం పెంపొందుతుందని ములుగు, భూపాలపల్లి జిల్లాల సబ్ రిజిస్ట్రార్ తస్లీమా మహమ్మద్ అన్నారు. శనివారం జాకారం సోషల్ వెల్ఫేర్ హాస్టల్ లో స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ తెలంగాణ ఆధ్వర్యంలో ఆల్ ఇండియా సివిల్ సర్వీసెస్ లో ప్రభుత్వ ఉద్యోగులకు జిల్లా స్థాయి క్రీడలు నిర్వహించారు. మనిషి మానసిక శారీరక ఆరోగ్యానికి వ్యాయామ విద్య క్రీడలే పునాది అని, శారీరక పటుత్వం, ఏకాగ్రతతో పాటు ఆత్మవిశ్వాసం పెరుగుతుందని తస్లీమా అన్నారు. క్రీడలు మానసిక వికాసానికి దోహదపడుతాయని ఆమె అన్నారు. ప్రభుత్వ ఉద్యోగులకు క్రీడలు నిర్వహించడం సంతోషకరమని, ఉద్యోగస్థులు స్వచ్ఛందంగా క్రీడ పోటీలలో పాల్గొనడం క్రీడా స్ఫూర్తిని చాటుతుందని తస్లీమా అన్నారు. అనంతరం కాసేపు వాలీబాల్, షటిల్ వారితో కలిసి ఆడారు. ఈ కార్యక్రమంలో జిల్లా యువజన మరియు క్రీడల శాఖ అధికారి పి.వి.రమణ చారి, వ్యాయామ ఉపాధ్యాయులు, తదితరులు ఉన్నారు.