కొమరంభీం జిల్లా దహేగాం మండలం రాళ్ళగూడ గ్రామంలో సోమవారం నకిలీ పత్తి విత్తనాలను కాగజ్నగర్ రూరల్ సీఐ నాగరాజు ఆద్వర్యంలో దహేగాం, పెంచికల్పేట్ పోలీసులు పట్టుకున్నారు. కాగజ్నగర్ రూరల్ సీఐ నాగరాజు తెలిపిన వివరాల ప్రకారం.. తమకు అందిన పక్కా సమాచారం మేరకు బోర్లకుంట గ్రామపంచాయతిలోని రాళ్లగూడ గ్రామంలో కాగజ్నగర్ రూరల్ సీఐ దహెగావ్, ఎస్ఐ పెంచికల్పేట్ ఎస్ఐలు, తమ పోలీస్ బలగాలతో కలిసి సోమవారం దాడులు నిర్వహించారు.
దహెగావ్ పీఎస్ పరిధిలోని రాళ్ళగూడకు చెందిన బీమాంకర్ పురుషోత్తం వద్ద నుండి 9 కిలోల నకిలీ విత్తనాలను, వాగాడే చిన్నబాపు వద్ద నుండి 11 కిలోలనకిలీ పత్తి విత్తనాలను స్వాధీనం చేసుకోవడం జరిగిందని, అలాగే అదే గ్రామానికి చెందిన వగాడే బాపూరావు వద్ద నుండి 100 లీటర్లు (20 లీటర్ల క్యాన్లు x 5 డబ్బాలు)గ్లైఫోసేట్, 55 ధృవ్ గ్లైఫోసేట్ ప్యాకెట్లను స్వాధీనం చేసుకున్నామని వాటి మొత్తం విలువ రూ. 2,25,000/- ఉంటుందని సీఐ వెల్లడించారు.
నకిలీ పత్తి విత్తనాలను స్వాధీనం చేసుకొని ముగ్గురిపై దహేగాం పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేసినట్లు సీఐ తెలిపారు. అమాయక రైతులను మోసం చేసే వారిని, జిల్లాలో నకిలీ పత్తి విత్తనాలు అమ్మేవారిపై కఠిన చర్యలు తీసుకుంటామని, పీడీ ఆక్టు నమోదు చేస్తామని సీఐ హెచ్చరించారు. ఈ దాడుల్లో పెంచికల్పేట్ ఎస్ఐ విజయ్, దహేగాం ఎస్ఐ సనత్ కుమార్, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.