తిరుపతి లోని శ్రీ తాతయ్యగుంట గంగమ్మ ఆలయ పునర్నిర్మాణంలో భాగంగా బయటపడ్డ 16 వ శతాబ్దపు”మహా మండప స్తంభాలను” తిరిగి ఆలయ ప్రకారం లోపల పునర్నిర్మాణం చేసి భవిష్యత్ తరాల వారికి ఆలయ నిర్మాణ చరిత్రను తెలియజేసేలా లిఖితపూర్వకంగా బోర్డును ఏర్పాటు చేయాలని రాయలసీమ పోరాట సమితి కన్వీనర్ నవీన్ కుమార్ రెడ్డి డిమాండ్ చేశారు.
తిరుపతి నగర ప్రజల ఆరాధ్య దైవంగా సాక్షాత్తు శ్రీ కలియుగ వెంకటేశ్వర స్వామి సోదరిగా పిలిస్తే పలికే గ్రామ దేవతగా విరాజిల్లుతున్న శ్రీ తాతయ్యగుంట గంగమ్మ ఆలయ పునర్నిర్మాణంలో భాగంగా 16వ శతాబ్దానికి చెందిన మహా మండప స్తంభాలు బయటపడటం, ఆర్కియాలజీ విభాగాధిపతి మునిరత్నంరెడ్డి ఆదేశాలతో వారి టీం పరిశీలించి పురాతన చారిత్రాత్మక స్తంభాలుగా ధ్రువీకరించడం జరిగింది.
తిరుమల శేషాచలం కొండల కింద ఉన్న తిరుపతిలో శ్రీ తాతయ్య గుంట గంగమ్మ ఆలయాన్ని విజయనగర రాజుల కాలంలో పల్లవ రాజులు వైష్ణవాలయానికి అనుగుణంగా నిర్మించారని మహా మంటప స్తంభాలను వాటిపై ఉన్న చిత్రాలను పరిశీలించిన ఆర్కియాలజీ అధికారులు మరింత పరిశోధనకు శ్రీకారం చుట్టడం శుభ పరిణామం. తిరుమల శ్రీవారి ఆలయం ముందు గతంలో వేయికాళ్ల మండపాన్ని తొలగించి ఆ మండపంలోని అతి పురాతనమైనటువంటి స్తంభాలను గోగర్భం డ్యాం ప్రాంతంలో నిరుపయోగంగా ఉంచారు.
అలాంటి పరిస్థితి గంగమ్మ ఆలయంలో బయటపడ్డ పురాతన స్తంభాలకు రాకుండా ఎక్కడో మ్యూజియంలో పెట్టి చేతులు దులుపు కోకుండా ఆలయ పునర్నిర్మాణ ప్రకారంలో ఏర్పాటు చేయాల్సిన బాధ్యత దేవాదాయ శాఖ,స్థానిక భక్తులపై ఉంది. తిరుపతి గోవిందరాజు స్వామి ఆలయం పక్కన గాంధీ రోడ్ లో ఎప్పటినుంచో ఉన్నటువంటి మ్యూజియంలో అతి పురాతనమైనటువంటి వస్తువులు ఉండేది భక్తులతో పాటు స్థానికులు సందర్శించేవారు
ఇటీవల ఉన్నపలంగా మరో మ్యూజియంకు తరలించేశారు. శ్రీ తాతయ్య గుంట ఆలయానికి సంబంధించిన అనేక చారిత్రాత్మకమైన విషయాలపై ఆర్కియాలజీ విభాగాధిపతులు మరింత చొరవ తీసుకొని కైకాల వంశస్తులతో, జాతర సందర్భంగా సారే తీసుకొని వచ్చే అవిలాల గ్రామంలోని పెద్దలతో,జాతర విశేషాలను పుస్తక రూపంలో రచించిన స్థానికులతో చర్చిస్తే మరిన్ని ఆసక్తికర అంశాలు వెలుగులోకి వస్తాయన్నారు.