మున్సిపల్ కార్మికులందరినీ పర్మినెంట్ చేయాలని సీఐటీయూ శ్రీకాకుళం జిల్లా ప్రధాన కార్యదర్శి పి.తేజేశ్వరరావు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. మంగళవారం శ్రీకాకుళం మున్సిపల్ కార్యాలయం వద్ద సీఐటీయూ ఆధ్వర్యంలో మున్సిపల్ కార్మికుల సమస్యలు పరిష్కరించాలని కోరుతూ ధర్నా నిర్వహించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మున్సిపల్ కార్మికులందరినీ పర్మినెంట్ చేసిన తర్వాతే సచివాలయాలకు బదలాయించాలని, పర్మినెంట్ కార్మికులకు హెల్త్ కార్డులు, జిపిఎఫ్ అకౌంట్లు ప్రారంభించాలని, ఇంజినీరింగ్ కార్మికులకు స్కిల్డ్, సెమీ స్కిల్డ్ జీతాలు చెల్లించాలని డిమాండ్ చేశారు.
కార్మిలందరికీ రక్షణ పరికరాలు, పనిముట్లు ఇవ్వాలని, భద్రతా సౌకర్యాలు కల్పించాలని కోరారు. రాష్ట్రంలో వైస్సార్ సిపి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక మున్సిపల్ కార్మికుల కష్టాలు తీరుతాయని భావించినా ఫలితం లేకుండాపోయిందని ఆయన అన్నారు.
గ్రీన్ ట్రిబ్యునల్ పేరుతో గొంతు కోస్తారా
మున్సిపల్ రంగంలో నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ ఆదేశాల పేరుతో గత తెలుగుదేశం ప్రభుత్వం తెచ్చిన మైక్రో ప్యాకేజీ విధానాలనే ప్రస్తుత వై.యస్.ఆర్.కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేయాలని చూస్తున్నదని విమర్శించారు. ఇంటింటికీ వెళ్లి చెత్త సేకరించడం, తడిచెత్త-పొడిచెత్త వేరుచేయడం, పని ప్రదేశాల్లో కార్మికులను వీడియో తీయాలని, ఈ పనులన్నీ చేయించాలని, చేయించని వారిపై చర్యలు తీసుకోవాలని మున్సిపల్ కమీషనర్లకు డైరెక్షన్ ఇవ్వడాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నామని అన్నారు.
సిబ్బందిని పెంచకుండా పనిముట్లు ఇవ్వకుండా,భద్రతా సౌకర్యాలు గురించి పట్టించుకోకుండా తడిచెత్త-పొడిచెత్త వేరుచేసి ఇవ్వాలని జనాన్ని చైతన్య వంతం చేయకుండా ఎలా సాధ్యమో చెప్పాలని ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. పర్యావరణం రక్షించాలంటే పని చేయడానికి అవసరమైన మేరకు కార్మికుల సంఖ్యను పెంచాలని డిమాండ్ చేశారు.
పెత్తందారులందరికీ పర్మినెంట్ ఉద్యోగాలా?
మురికి కంపులో, విషవాయువు ల మధ్య పనిచేసే వారిని ఎందుకు పర్మినెంట్ చేయరని ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. మున్సిపల్ కార్మికులందరినీ పర్మినెంట్ చేయాలని,సమాన పనికి సమాన వేతనం అమలు చేయాలని, కార్మికులందరికి 6 నెలల కొకసారి ప్రభుత్వమే వైద్య పరీక్షలు నిర్వహించాలని డిమాండ్ చేశారు.
కరోనా లో విధులు నిర్వహిస్తున్న వారికి నెలకి రూ.25వేలు ప్రత్యేక అలవెన్స్ చెల్లించాలని డిమాండ్ చేశారు.జూలై3న ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా కేంద్ర కార్మిక సంఘాలు ఇచ్చిన దేశవ్యాప్త సహాయనిరాకరణ,శాసన ఉల్లంఘన కార్యక్రమంలో మున్సిపల్ కార్మికులంతా పాల్గొని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమంలో శ్రీకాకుళం మున్సిపల్ వర్కర్స్&ఎంప్లాయీస్ ఫెడరేషన్ నాయకులు ఎన్.బలరాం,కె.రాజు కె.మల్లేష్,ఎస్.రాజన్న,ఎన్.పార్థసారథి, కె.మాధవి, ఏ.గురుస్వామి,ఏ.రాము తదితరులు పాల్గొన్నారు.