ల్యాంకో కార్మికులకు శ్రీకాళహస్తి ఎమ్మెల్యే బియ్యపు మధుసూదన్ రెడ్డి నేడు నిత్యావసర సరుకులు ఉచితంగా పంపిణీ చేశారు. ఒరిస్సా, బీహార్ తదితర రాష్ట్రాల నుండి ఉపాధి కోసం వచ్చి స్థానిక రాచుగున్నేరి లో ఉన్న లాంకో పరిశ్రమల్లో ఎంతో మంది పని చేస్తున్నారు.
కరోనా మహమ్మారి విజృంభిస్తున్న నేపథ్యంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు లాక్ డౌన్ ప్రకటించిన కారణంగా వీరు ఉపాధికి దూరం అయ్యారు. అదే సమయంలో వారు స్వస్థలాలకు వెళ్లలేకపోయారు. ఈ విషయాన్ని స్థానిక ఎమ్మెల్యే గ్రహించి సుమారు 1500 మందికి గోధుమపిండి, బంగాళదుంపలు, బియ్యం, టమోటాలు అందజేశారు.
వైయస్సార్ బీసీ కాలనీ, చటర్జీ నగరాలలో నివసిస్తున్న కార్మికులతో ఎమ్మెల్యే బియ్యపు మధుసూదన్ రెడ్డి మాట్లాడి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు.
పరిశ్రమ మూతపడినా పని లేకపోయినా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన ఆదేశాల మేరకు యాజమాన్యంతో మాట్లాడి ఈ లాక్ డౌన్ కాలానికి కూడా అందరికీ జీతం ఇప్పిస్తానని, ఎవరు అధైర్య పడవద్దని హామీ ఇచ్చారు. సుమారు 10 లక్షల రూపాయల తన సొంత డబ్బుతో సరుకులు అందిస్తున్నామని, ఇంకా ఏమైనా సమస్య వచ్చినా నేనున్నానని కార్మికులకు భరోసా ఇచ్చారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే బియ్యపు మధుసూదన్ రెడ్డి మాట్లాడుతూ రాజకీయాలు ఎన్నికల వరకేనని, ఓట్లతో పని లేకుండా వేరే రాష్ట్రం నుండి ఇక్కడకు వచ్చి పని చేస్తూ ఆకలితో అలమటిస్తున్న వారిని చూచి చలించిపోయానని, ఇలాంటి ఆపద సమయంలో వారికి అండగా ఉంటానని తెలిపారు. సామాజిక దూరం పాటిస్తూ వారి యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే బియ్యపు మధుసూదన్ రెడ్డి తో పాటు మండల పార్టీ అధ్యక్షుడు బర్రి హేమాబుషన్ రెడ్డి, బొల్లినేని జగన్నాథం నాయుడు, ఎంపీటీసీ హరి, రామచంద్రయ్య, సురేష్ ,మహేష్, ప్రభాస్ ,మురళి ,ప్రకాష్ తదితరులు పాల్గొన్నారు.