తిరుమల శ్రీవారి ఆలయంలో తొమ్మిది రోజుల పాటు జరిగిన శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలు శుక్రవారం రాత్రి ధ్వజావరోహణంతో ముగిశాయి.
రాత్రి 7 గంటలకు ఆలయంలో బంగారు తిరుచ్చి ఉత్సవం, రాత్రి 8.00 నుండి 9.00 గంటల మధ్య ధ్వజావరోహణ ఘట్టం నిర్వహించారు. ధ్వజారోహణం నాడు గరుడాళ్వార్ ఆహ్వానించిన దేవతలను తిరిగి సాగనంపే కార్యక్రమమే ధ్వజావరోహణం. తిరిగి వచ్చే ఏడాది బ్రహ్మోత్సవాలకు రావాల్సిందిగా ఈ సందర్భంగా గరుడాళ్వార్ దేవతలను కోరతాడు. ఈ సందర్భంగా గరుడధ్యానం, భేరిపూజ, భేరితాడనం, గరుడగద్యం, దిక్పాలక గద్యం, గరుడ లగ్నాష్టకం, గరుడ చూర్ణిక అనే ఏడు మంత్రాలను అర్చకులు జపించారు.
ఈ కార్యక్రమంలో శ్రీశ్రీశ్రీ పెద్దజీయర్స్వామి, శ్రీశ్రీశ్రీ చిన్నజీయర్స్వామి, టిటిడి ఈవో డాక్టర్ కెఎస్.జవహర్రెడ్డి దంపతులు, బోర్డు సభ్యులు ఎపి.నందకుమార్, అదనపు ఈవో ఎవి.ధర్మారెడ్డి దంపతులు, జెఈఓ సదా భార్గవి, సివిఎస్వో గోపినాథ్ జెట్టి దంపతులు, ఆలయ డెప్యూటీ ఈఓ రమేష్ బాబు, విజివో బాలిరెడ్డి, ఇతర అధికారులు పాల్గొన్నారు.