ఊహించినట్లుగానే పంచాయితీ ఎన్నికలకు సంబంధించి ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ఇచ్చిన తీర్పుపై రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టుకు వెళ్లింది. రాష్ట్రంలో పంచాయతీ ఎన్నికలు జరపాలన్న హైకోర్టు తీర్పును సవాల్ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించింది.
హైకోర్టు ఉత్తర్వులు రద్దు చేయాలని కోరుతూ పిటిషన్ దాఖలు చేసింది. కరోనా వ్యాక్సినేషన్ కొనసాగుతున్న వేళ ఎన్నికల నిర్వహణ సాధ్యం కాదని తన పిటిషన్ లో తెలిపింది.
ఇటీవలే ఏపీలో పంచాయతీ ఎన్నికలకు ఎస్ఈసీ షెడ్యూల్ విడుదల చేయగా, ప్రభుత్వం అభ్యంతరం చెబుతూ హైకోర్టుకు వెళ్లింది. ఎన్నికలు వద్దంటూ హైకోర్టు సింగిల్ బెంచ్ తీర్పు ఇచ్చింది.
దాంతో ఎస్ఈసీ… హైకోర్టు ద్విసభ్య ధర్మాసనాన్ని ఆశ్రయించారు. దీనిపై హైకోర్టులో విచారణ జరగ్గా, తీర్పును రిజర్వ్ లో ఉంచింది. ఇవాళ ఎస్ఈసీకి అనుకూలంగా హైకోర్టు తీర్పు వెలువరించింది.
సింగిల్ జడ్జి ఇచ్చిన తీర్పును కొట్టివేస్తూ, ఏపీలో స్థానిక ఎన్నికలకు పచ్చజెండా ఊపుతూ ద్విసభ్య ధర్మాసనం తీర్పు ఇచ్చింది. ఈ తీర్పుపై జగన్ ప్రభుత్వం సుప్రీంకోర్టుకు వెళ్లింది.