తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కరోనా వైరస్ ను నియంత్రించడంలో ఘోరంగా విఫలమైందని తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ జాయింట్ సెక్రెటరీ యం.డి.అజీజ్ పాషా ధ్వజమెత్తారు. పిసిసి అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి ఇచ్చిన పిలుపు మేరకు పలువురు కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు సామాజిక మాధ్యమాల్లో మాట్లాడారు.
సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ నియోజకవర్గ కేంద్రంలో అజీజ్ పాషా శనివారం మాట్లాడుతూ పారాసెటమాల్ మాత్ర వేసుకుంటే సరిపోతుందని,22 డిగ్రీల ఉష్ణోగ్రతకు కరోనా వైరస్ నశిస్తుందని,మాస్కులు ధరించే అవసరం లేదని మాట్లాడిన కేసిఆర్ ఇప్పుడు ప్రజలకు ఏమి సమాధానం చెపుతారని ప్రశ్నించారు.
రాష్ట్రంలో కరోనా వైరస్ విజృంభించి విస్తరిస్తుంటే నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరించడం సరికాదని అన్నారు. తెలంగాణ రాష్ట్రంలో తెల్ల రేషన్ కార్డు ఉన్న ప్రతి ఒక్కరికీ కరోనా వైరస్ టెస్టులు ఉచితంగా చేయాలని, వ్యాధి సోకిన వారికి ఉచిత చికిత్స అందించాలని డిమాండ్ చేశారు.
ఈ మధ్య కాలంలో రాష్ట్రంలో కరోనా వైరస్ విద్య నిర్వహణలో మరణించిన జర్నలిస్టులకు, పోలీస్ శాఖ సిబ్బందికి, పారిశుద్ధ్య సిబ్బందికి, 50 లక్షల రూపాయలు పరిహారం ఇవ్వాలని కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తుందని అన్నారు. కార్పొరేట్ ఆసుపత్రులలో వైద్యం పేరుతో ప్రజలను జలగల్లా పీడిస్తున్నారని, కనుక రాష్ట్ర ప్రభుత్వమే కార్పోరేట్ ఆసుపత్రులలో 50 శాతం ప్రభుత్వం ఆధీనంలోకి తీసుకొని పేదలకు చికిత్సను ఉచితంగా అందించాలని కోరారు.
గతంలో కాంగ్రెస్ పార్టీ పిసిసి అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి ప్రభుత్వానికి ఎన్నో మార్లు ప్రభుత్వం కరోనా వైరస్ టెస్టుల సంఖ్య పెంచాలని డిమాండ్ చేసినప్పటికీ ప్రభుత్వం పెడచెవిన పెట్టిందని ఆయన అన్నారు. కరోనా టెస్టుల అనిపించినట్లయితే ఇంత తీవ్రమైన పరిస్థితి ఈనాడు ఉండేది కాదని, దీనంతటికీ రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు బాధ్యత వహించాలని అన్నారు.
బాధ్యతా రాహిత్యంతో రాష్ట్రంల్లో కరోనాను ప్రభుత్వమే పెంచిందని, ఇకనైనా రాష్ట్రప్రభుత్వం పునరాలోచించి కరోనా వైరస్ టెస్టులను పెంచి, ఆరోగ్యశ్రీ లో చేర్చి పేద ప్రజలను ఆదుకోవాలని, ప్రభుత్వ వైద్యశాలలో ఆక్సిజన్ తో పాటు అన్ని సదుపాయాలు ఉండేలా చూడాలని, ఎందరో దాతలు సీఎం సహాయ నిధికి ఇచ్చిన విరాళాలను ఖర్చు చేసి రాష్ట్ర ప్రజలను ఆదుకోవాలని సామాజిక మాధ్యమాల ద్వారా కాంగ్రెస్ పార్టీ తరుపున కోరారు.