మిస్సింగ్ బాలిక అంశంలో వెంటనే స్పందించి బాలికను తల్లిదండ్రుల వద్దకు చేర్చేలా రాష్ట్ర మానవ హక్కుల కమిషన్ చర్యలు తీసుకున్నది. చైర్మన్ జస్టిస్ మాంధాత సీతారామ మూర్తి, జుడిషియల్ సభ్యులు డి సుబ్రహ్మణ్యం, నాన్ జుడీషియల్ సభ్యులు డాక్టర్ శ్రీనివాసరావు గోచిపాత ఈ మేరకు చర్యలు తీసుకున్నారని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మనవ హక్కుల కమిషన్ సెక్షన్ ఆఫీసర్ బొగ్గరం తారక నరసింహ కుమార్ తెలిపారు.
వివరాల్లోకి వెళితే అనంతపురం జిల్లా గుత్తి మండలం ఊటకల్లు గ్రామానికి చెందిన వెలుగోడు పెద్ద లాలూ సాబ్ తన కుమార్తె వెలుగోడు మౌలాని (15) ని అదే గ్రామానికి చెందిన బోయ ఆదిశేషయ్య బలవంతంగా తీసుకెళ్లిన సందర్భంగా, తన కూతురి ఆచూకీ తెలపాలని గుత్తి, డోన్ రూరల్ పోలీసు స్టేషన్ లో ఫిర్యాదు చేయగా వారు సరిగా స్పందించడం లేదని, తన కూతురిని తన దగ్గరికి చేర్చాలని, అదే విధంగా బోయ ఆదిశేషయ్య పై చట్టపరంగా తగు చర్యలు తీసుకోవాలని కోరుతూ రాష్ట్ర మానవ హక్కుల కమిషన్ను ఆశ్రయించారన్నారు.
ఈ అంశంపై రాష్ట్ర మానవ హక్కుల కమిషన్ వెంటనే స్పందించి అనంతపురం కర్నూలు జిల్లాల ఎస్పీలకు షోకాజ్ నోటీసులు జారీ చేసిందని, దీంతో పోలీసులు విచారణ వేగవంతం చేసి బాలిక ఆచూకీ కనుగొని మైనర్ బాలిక అయిన మౌలానిని ప్రభుత్వ నిబంధనల ప్రకారం చైల్డ్ వెల్ఫేర్ కమిటీ ద్వారా తల్లిదండ్రులకు అప్పజెప్పినట్లు గుత్తి, డోన్ రూరల్ సర్కిల్ ఇన్స్పెక్టర్ లు మంగళవారం కమిషన్ ముందు హాజరై నివేదించారన్నారు..బాలిక అప్పగింత విషయాన్ని మౌలాని తల్లిదండ్రులతో ధృవీకరించుకున్న మీదట కమిషన్ కేసును మూసివేసిందని సెక్షన్ ఆఫీసర్ వివరించారు.