సెంట్రల్ విస్టా ప్రాజెక్టును తక్షణమే నిలుపుదల చేసి ఆ డబ్బుతో యుద్ధ ప్రాతిపదికపైన కరోనా వైరస్ పై పోరాటం చేయాలని దేశంలోని 12 ప్రధాన ప్రతిపక్ష పార్టీలు ప్రధాని నరేంద్రమోడీకి నేడు లేఖ రాశాయి. దేశం అత్యంత క్లిష్ట పరిస్థితులు ఎదుర్కొంటున్న ఈ సమయంలో నిధులను అత్యవసరాల కోసం మాత్రమే వినియోగించాలని, ఆడంబరాలకు కాదని వారు పేర్కొన్నారు. ప్రధానికి వినతి పత్రం సమర్పించిన వారిలో కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు సోనియాగాంధీ, మాజీ ప్రధాన మంత్రి హెచ్ డి దేవేగౌడ (జనతా దళ్ సెక్యులర్), శరద్ పవార్ (ఎన్ సి పి), మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్దావ్ ధాక్రే (శివసేన) మమతా బెనర్జీ (తృణమూల్ కాంగ్రెస్) ఎం కె స్టాలిన్ (డిఎంకె) హేమంత్ సోరేన్ (జార్ఖండ్ ముక్తి మోర్చా) మాజీ ముఖ్యమంత్రులు ఫరూక్ అబ్దుల్లా ( నేషనల్ కాన్ఫరెన్స్) అఖిలేష్ యాద్ (సమాజ్ వాది పార్టీ) తేజస్వి యాదవ్ ( రాష్ట్రీయ జనతాదళ్), డి రాజా (సీపీఐ) సీతారాం ఏచూరి (సిపిఎం) ఈ సంయుక్త లేఖపై సంతకాలు చేశారు. సెంట్రల్ వెస్టా ప్రాజెక్టును తక్షణమే రద్దు చేసి ఆ నిధులను వ్యాక్సినేషన్ కోసం వినియోగించాలని వారు సూచించారు. దేశంలో అవసరం ఉన్న ప్రతి వ్యక్తికి ఆహార ధాన్యాలు సరఫరా చేయాలని వారు కోరారు. దేశంలోని నిరుద్యోగులకు ప్రతి ఒక్కరికి నెలకు కనీసం 6 వేల రూపాయలు ఇవ్వాలని వారు ప్రధానిని కోరారు.
previous post