కరోనా విస్తృతి సమయంలో విధించిన లాక్ డౌన్ నుంచి ఉపశమనం పొందేందుకు ప్రభుత్వం ఏం చర్యలు తీసుకున్నా సరిపోవు. ఈ మాట ఎందుకు అనాల్సి వస్తున్నదంటే అన్నీ సమకూర్చినా మీ స్వేచ్ఛను హరిస్తున్నాం అంటే ఏదో కోల్పోయిన బాధ అందరిని పట్టిపీడిస్తున్నది.
అదొక్కటే సమస్య. స్వేచ్ఛ అంటే చదువుకోవడానికో, పని చేసుకోవడానికో కాకుండా రోడ్లపై బలాదూర్ తిరగడానికి అంటే మాత్రం అంగీకరించే అవసరమేలేదు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సమకూరుస్తున్న నిధులు, సౌకర్యాలతో దేశంలోని దాదాపు 80 శాతం మందికి ఆహార పదార్ధాలు చేరతాయని అంచనా ఉంది.
అలా చేయకుండా మధ్యలోనే కొట్టేసేవాడు ఉంటే మరో 10 శాతం తగ్గించినా కనీసం 70 శాతం మందికి చేరవచ్చు. దేశ జనాభాలో 70 శాతం మందికి వెసులుబాటు కల్పించడం మామూలు విషయం కాదు. అందుకు ప్రభుత్వ యంత్రాంగాన్ని అభినందించకతప్పదు.
పేదలకు ఆహార పదార్ధాలు లేదా డబ్బులు సర్దేసి అంతా చేసేశామని చెప్పకుండా మధ్య తరగతి వారిని ఆదుకునే విధంగా ఈఎంఐ లు మూడు నెలల పాటు వాయిదా వేయడం కూడా మంచి విషయమే. ఈఎంఐ లు కట్టే ఇబ్బంది తప్పితే మధ్యతరగతి మానవుడు విశ్రాంతిగా ఇంట్లో ఉండగలుగుతారు.
ప్రభుత్వం, స్వచ్ఛంద సంస్థలు ఆహార పదార్ధాలు, నిత్యావసర వస్తువులు అందించలేని వారి పరిస్థితి ఏమిటి? బయటకు రావడానికి వీల్లేని స్థితిలో ఇలాంటి వారు పలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఎగువ మధ్య తరగతి, ఉన్నత ఆదాయం గల కుటుంబాలకు ఆహార పదార్ధాలు, నిత్యావసర వస్తువులు ఆన్ లైన్ లో సరఫరా చేసేందుకు ఫుడ్ చైన్ ల వారికి, మల్టీ నేషనల్ కంపెనీలకు అనుమతి ఇస్తున్నారు.
ఇది తక్షణమే ఆపాల్సిన అవసరం ఉంది. ఈ ఆన్ లైన్ వ్యాపారం వల్ల కరోనా మరింత విస్తరించే అవకాశం ఉంది. ఆన్ లైన్ సరఫరాల కారణంగా ఒకే వ్యక్తి చాలా మందికి ఆహార పదార్ధాలు కానీ నిత్యావసరాలు కానీ సరఫరా చేస్తాడు. అతను ఎంత జాగ్రత్తగా ఉన్నా కూడా వైరస్ తో ఇన్ ఫెక్ట్ అయ్యే అవకాశాలు ఎక్కువ ఉంటాయి.
ఆన్ లైన్ వస్తువులు సరఫరా చేసే వారు పైన తమ కంపెనీని సూచించే కోటు వేసుకుంటారు. మీరంతా దాన్ని ఒక్క సారి గమనించండి. దాన్ని ఎవరూ పరిశుభ్రం చేయరు. దాన్నే వేసుకుని డెలివరీ బాయ్ తిరుగుతుంటాడు. కరోనా వైరస్ సంక్రమించకుండా ఉండేందుకు హాండ్ శానిటైజర్లు తగినంతగా వారికి ఇవ్వడం లేదు.
కరోనా సోకి ఇంకా వ్యాధి లక్షణాలు బయటపడని వారికి వస్తువులను ఇచ్చి అదే చేత్తో అందరికి వస్తువులు డెలివరీ చేస్తుంటే డెలివరీ బాయ్ కి తీసుకున్న వారికి కూడా ఎంత ప్రమాదమో ఊహించండి. అందుకే తక్షణమే కేంద్ర ప్రభుత్వం ఈ మల్టీ నేషనల్ కంపెనీలకు అనుమతులు ఉపసంహరించుకోవాలి.
మరి ప్రత్యామ్నాయం ఏమిటి? ప్రత్యామ్నాయంగా ఆంధ్రప్రదేశ్ లోని కడప జిల్లా రాజంపేట మునిసిపాలిటీలో జరుగుతున్న విషయాన్ని ప్రస్తావిస్తాను.
అక్కడ మునిసిపల్ కమిషనర్ నిన్న స్థానిక కిరాణం వ్యాపారులతో సమావేశం ఏర్పాటు చేసి ఎవరి వద్ద స్టాక్ ఉంది ఎవరు సరఫరా చేయగలుగుతారు అని సమాచారం సేకరించి వారి జాబితాను ఫోన్ నెంబర్ తో సహా కరపత్రాలుగా ముద్రించి పట్టణం మొత్తం పంచి పెట్టారు.
వారి వారి ప్రాంతాలలోని సరకుల షాపుకు ఫోన్ చేస్తే సరకులు వారి ఇళ్లకు వచ్చేస్తాయి. ఈ విధంగా అదే పట్టణంలో ఉంటే వ్యక్తుల మధ్యే సరకు సరఫరా జరుగుతుంది కాబట్టి కరోనా విస్తరించే అవకాశాలు అసలు ఉండకపోవచ్చు. దీనివల్ల స్థానికంగా ఉండేవారికి ఉపాధి కలుగుతుంది.
నిత్యావసరాలు కూడా అందుతాయి. ఆయా పట్టణాలలో ఉండే వ్యాపారులకు సరకులు అందచేసే బాధ్యత (చెల్లింపులు ఆన్ లైన్ లో చేసి హోల్ సేల్ వ్యాపారుల నుంచి రీటైల్ వ్యాపారులకు సరకు చేరే వరకూ) ప్రభుత్వం తీసుకుంటే చాలా వరకూ సమస్య తీరుతుంది. ప్రభుత్వ అధికారులు ఆలోచించాలి.