తిరుమల తిరుపతి దేవస్థానాలకు చెందిన ఎస్ వి గోశాల అకస్మాత్తుగా ఎందుకు వివాదాల్లో చిక్కుకున్నది? గత కొద్ది రోజులుగా వైసీపీ చేస్తున్న రాజకీయ విమర్శలు, దానికి తిరుమల తిరుపతి దేవస్థానం ఇస్తున్న వివరణలు చూస్తుంటే ఈ ప్రశ్న తలెత్తక మానదు. హిందూ ధర్మ పరిరక్షకుడు వై ఎస్ జగన్ అంటూ వైసీపీ తన సోషల్ మీడియాలో అకస్మాత్తుగా ప్రచారం ప్రారంభించింది. ఆ తర్వాత రెండు రోజులకు ఒక సంచలనాత్మక విషయం వెల్లడి కాబోతున్నట్లు వైసీపీ సోషల్ మీడియా తన అధికారిక హ్యాండిల్స్ లో ప్రచారం చేసింది.
ఆ తర్వాత టీటీడీ మాజీ అధ్యక్షుడు భూమన కరుణాకరరెడ్డి టీటీడీ ఎస్ వి గోశాలలో ఒకే సారి 100 ఆవులు చనిపోయాయని మీడియా సమావేశంలో వెల్లడించడంతో ఈ వివాదం ఆరంభమైంది. భూమన ఆరోపణలను టీటీడీ చైర్మన్ బీ ఆర్ నాయుడు తీవ్రంగా ఖండించారు. అలాంటిదేం లేదని, అవాస్తవాలు ప్రచారం చేస్తున్నారని భూమనపై ఆయన విరుచుకుపడ్డారు. అసలు భూమన ఈ విషయం ఎందుకు బయటకు చెప్పారనే విషయంపై బీఆర్ నాయుడు వివరిస్తూ సస్పెండ్ అయిన మాజీ గోశాల అధికారి హరినాథ్ రెడ్డి ఇచ్చిన తప్పుడు సమాచారాన్ని భూమన కరుణాకర్ రెడ్డి ప్రచారం చేస్తున్నారని అన్నారు.
అసలు హరినాథ్ రెడ్డి అన్నింటికి తెగించి భూమనకు సమాచారం ఇవ్వడం, దాన్ని వైసీపీ అధికారిక సోషల్ మీడియా హ్యాండిల్స్ ద్వారా విస్తృతంగా ప్రచారం చేయడం వెనుక ఆసక్తికర విషయాలు ఉన్నాయి. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పాటు కాగానే తిరుమల తిరుపతి దేవస్థానాలను సమూలంగా ప్రక్షాళన చేయాలని భావించి చర్యలు చేపట్టింది. అందులో భాగంగా శ్రీవారి గోశాలపై విజిలెన్స్ విచారణ జరిపించింది. నివేదిక బయటకు వచ్చింది.
మొగుడ్ని కొట్టి మెగసాలకెక్కినట్లు….
టీటీడీలో జరిగిన అక్రమాలను వెలికితీయడంతో బాటు భవిష్యత్తులో అలాంటి తప్పులు జరగకుండా చర్యలు తీసుకోవడంలో భాగంగా విజిలెన్స్ నివేదిక బయటకు రాబోతున్నదని తెలిసిన వెంటనే వైసీపీ నేతలు ముందుగానే గోశాలపై ఆరోపణలు ప్రారంభించారు. వంద ఆవులు చనిపోయినట్లు ప్రచారానికి తెరతీశారు. వైసీపీ సోషల్ మీడియా అంతా ఇలాంటి పోస్టులతోనే నిండిపోయింది.
“మొగుడ్ని కొట్టి మొగసాలకి ఎక్కినట్లు” టీటీడీలో గత ప్రభుత్వంలో జరిగిన దారుణాలు ఎక్కడ బయట పడతాయనే భయంతో, ముందుగానే రోడ్డెక్కి కూటమిపై నిందలు వేస్తున్న వైసీపీ నేతల ప్రయత్నాల్లో భాగమే టీటీడీ మాజీ అధ్యక్షుడు భూమన కరుణాకరరెడ్డి ఆరోపణలుగా వెల్లడి అయింది. వైసీపీ ప్రభుత్వ హయాంలో టీటీడీ గోసంరక్షణ శాలల్లో జరిగిన ఘోరాలు అన్నీఇన్నీ కావు… చనిపోయిన ఆవులు, దూడలను నిర్దాక్షణంగా చెత్తబుట్టల్లో పారేశారని కూడా విజిలెన్స్ నివేదికతో బయటకు వచ్చింది. చాలా చోట్ల గోవులు లేకుండానే దాణా కొనుగోలు అంటూ భారీ ఎత్తున అవినీతి చేసినట్లు విజిలెన్స్ అధికారులు కనుగొన్నారు.
కాలంచెల్లిన మందులతో గోవులకు ముప్పు తెచ్చారు…
గోవులకు నాసిరకం దాణా, కాలంచెల్లిన మందులు ఇచ్చి నోరులేని మూగజీవాల ప్రాణాలను తీసుకున్నారు. గోవులు మరణించిన ఆ లెక్కలు బయటకు రాకుండా తొక్కి పెట్టారు, ఈ అరాచకాలకు అప్పటి గోశాల డైరెక్టర్ హరినాథ్రెడ్డినే బాధ్యుడు అనే విషయాలు కూడా విజిలెన్స్ విచారణలో వెల్లడి అయింది. తన అక్రమాలు బయటపడతాయన్న ఉద్దేశంతో విజిలెన్సు అధికారులను గోశాలలోకి రాకుండా హరినాథ్ రెడ్డి ఇష్టానుసారం వ్యవహరించాడు. వైసీపీ ప్రభుత్వ హయాంలో ఏప్రిల్, 2022 – జనవరి 2023 మధ్యన తిరుపతిలోని ఎస్వీ గోశాలలో 27, పలమనేరు గోశాలలో 26, కమలయ్యగారిపల్లి గోశాలలో 7 మొత్తం కేవలం 10 నెలల వ్యవధిలో 60 ఆవులు, దూడలను నిర్లక్ష్యంతో పొట్టనపెట్టుకున్నారని విజిలెన్స్ నివేదిక స్పష్టం చేస్తున్నది.
గత ప్రభుత్వం హయంలో తిరుపతిలోని ఎస్వీ గోశాలలో ఆరోగ్యకరమైన ఆవులు సైతం, వసతులు లేమితో, సిబ్బంది నిర్లక్ష్యంతో, చికిత్స అందక ఎన్నో మూగజీవాలు మృత్యువాతపడ్డాయి. ఎప్పుడు తయారు చేశారు? గడువు ఎప్పటి వరకు ఉంది? అనే వివరాలు లేని నాణ్యతలోపపు దాణా విజిలెన్స్ అధికారుల కళ్ళ పడకుండా కుట్రలు చేశారు. విరాళంగా వచ్చిన గోవుల రికార్డులు కూడా సరిగా నిర్వహించలేదు అప్పటి గోశాల డైరెక్టర్ హరినాథ్రెడ్డి. తిరుపతి జిల్లా యర్రావారిపాళెం మండలం కమలయ్యగారిపల్లిలో ఆవులు లేకున్నా.. అక్కడి గోశాలలో దాణాకూ టెండర్లు పిలిచారు.
ఎస్వీ, కమలయ్యగారిపల్లిలోని గోశాలలకు కలిపి పశుగ్రాసం గుత్తేదారుకు రూ. 1.78 కోట్లు చెల్లించారు. బయో మెన్యూర్ని ఎన్రిచ్డ్ బయోమెన్యూర్గా తయారు చేసేందుకు క్యూబ్ బయో ఎనర్జీ అనే సంస్థతో ఆవుపేడ, ఆవు మూత్రం, కరెంటు, యంత్రాలు, నీరు, షెడ్ల వంటివన్నీ ఉచితంగా ఇచ్చి కూడా టన్నుకు రూ.7,500 చొప్పున చెల్లించారు. విస్తుగొలిపే విజిలెన్సు నివేదిక లో ఇంకా ఏమున్నదో తెలిస్తే మనం ఆశ్చర్య పోక మానదు. 2021 జులై 22న విజిలెన్స్ నివేదిక ప్రకారం టీటీడీకి రూ.78 కోట్ల నష్టం వాటిల్లింది.
2023 ఏప్రిల్ 6న ఆవులకు నాచుపట్టిన నీరు, కుళ్లిన దాణా ఇచ్చినట్లు విజిలెన్స్ ధ్రువీకరించింది. 2024 ఏప్రిల్ 1న కాలం చెల్లిన ఔషధాల వినియోగం బయటపడింది. నాణ్యత లేని దాణా, నిర్లక్ష్య నిర్వహణతో అనేక ఆవులు మరణించగా, వాటి సంఖ్యను తక్కువగా చూపారు. 2019-24 మధ్య విజిలెన్స్ తనిఖీల్లో గోశాల అక్రమాలు బట్టబయలైనా, గత ప్రభుత్వం చర్యలు తీసుకోలేదు. ‘గుడికో గోమాత’ కార్యక్రమంలో 196 గోవులను ఆలయాలకు ఇచ్చినా, వాటి సంరక్షణను పట్టించుకోలేదు. నిమ్మకూరు, నగరి, ఒంటిమిట్టలో టీటీడీ నిర్లక్ష్యంతో ఆవులు, లేగదూడలు చనిపోయాయి.
కూటమి ప్రభుత్వం వచ్చాక పెరిగిన ఆవుల సంఖ్య
ఎస్వీ గోశాలలో అక్రమాలపై విజిలెన్స్ అధికారులను ఫొటోలు తీసుకోనివ్వకుండా డైరెక్టర్ హరినాథ్రెడ్డి అడ్డుకున్నారు. సాధారణంగా ప్రతినెల 15 ఆవులు అనారోగ్యం, వృద్ధాప్యం వల్ల చనిపోతే, 2024లో మొత్తం 179 ఆవులు మరణించాయి. 2025 జనవరి–మార్చి మధ్య 2,700 గోవుల్లో 43 మాత్రమే మృతి చెందాయి. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన మూడు నెలల్లో ఎస్వీ గోశాలలో 59 దూడలు జన్మించాయి. గతంలో తిరుపతి గోసంరక్షణశాలలో రోజుకు 450 లీటర్ల పాల ఉత్పత్తి జరగ్గా, ఇప్పుడు అది 762 లీటర్లకు పెరిగింది.