మోడీ ప్రభుత్వం కార్మిక ప్రజావ్యతిరేక విధానాలను నిరసిస్తూ జరిగే సమ్మెలో అసంఘటిత రంగ కార్మికులు పెద్దఎత్తున పాల్గొనాలని ఐఎఫ్టియు జిల్లా ప్రధాన కార్యదర్శి జి రామయ్య కోరారు. ఖమ్మం నగరంలో బైపాస్ ప్రాంతములో మార్బుల్ షాప్ లలో పనిచేస్తున్న హమాలీల సమ్మె సన్నాహక జనరల్ బాడీ ఐఎఫ్టియు ఏరియా కార్యదర్శి ఆడెపు రామారావు అధ్యక్షతన జరిగింది. దీనిలో జి రామయ్య మాట్లాడుతూ 44 కోట్ల మంది అసంఘటిత కార్మికులకు ఎటువంటి చట్టబద్దమైన హక్కు లేక శ్రమ దోపిడీకి గురవుతున్నారని వారికి కార్మిక చట్టాలు అమలు చేయాలని డిమాండ్ చేశారు.
మోడీ ప్రభుత్వం కార్మిక వర్గానికి చట్టాలను అమలు చేయకుండా నాలుగు లేబర్ కోడ్ లు తీసుకొచ్చి అసంఘటిత రంగ కార్మికులకు ఉరితాడుగా మారబోతున్నదన్నారు. సమ్మె కార్మికుల హక్కుల కోసం దేశ రక్షణ కోసం జరుగుతుందన్నారు. 28వ తారీఖు నాడు ఖమ్మం పెవిలియన్ గ్రౌండ్ నుంచి భారీ ర్యాలీ ఉంటుందన్నారు. ఈ ర్యాలీ లో కార్మిక వర్గం పెద్ద ఎత్తున పాల్గొని తమ హక్కులను రక్షించుకోవాలని, పని భద్రత కాపాడుకోవాలని కోరారు. మోడీ, కేసీఆర్ పోటీపడి ప్రజలపై భారాలు వేస్తున్నారని వీటికి వ్యతిరేకంగా గా పోరాడాలని , పెంచిన ధరలను తగ్గించాలని డిమాండ్ చేశారు. ఉన్న చట్టాలను అమలు చేయాలని అడిగితే నాలుగు లేబర్ కోడ్ లు తీసుకొచ్చి కార్మికులను కట్టుబానిసలా చేస్తున్నారని ఆరోపించారు.
మార్చి 28 29 తేదీల్లో జరిగే సమ్మెలో కార్మిక వర్గం పెద్ద ఎత్తున పాల్గొని సమ్మెను జయప్రదం చేయాలని వారు కోరారు . ఈ సమావేశంలో హమాలి నాయకులు తిరపయ్య, కృష్ణ, రవీందర్, రామారావు. రమేష్. ప్రభాకర్. పీ వై ఎల్ రాష్ట్ర ఉపాధ్యక్షులు కే శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు