హింసాత్మక చర్యలకు పాల్పడే రౌడీలపై కఠిన చర్యల పాటు నగర బహిష్కరణ చేస్తామని ఏలూరు రేంజ్ డి ఐ జి కె. వి. మోహనరావు హెచ్చరించారు. మంగళవారం రాజమహేంద్రవరం రెండవ పట్టణ పోలీస్ స్టేషన్ లో మోహనరావు మీడియా సమావేశం నిర్వహించి వివరాలు వెల్లడించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రౌడీయిజాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ సహించమని కఠినంగా అణచివేస్తామని ఇప్పటికే ఎస్ పి కి చెప్పామని అన్నారు. స్పెషల్ టీమ్స్ ను కూడా పెట్టామని తెలిపారు. రౌడీ షీటర్లపై నిఘా పెట్టామని చెప్పామని అన్నారు.
యాక్టీవ్ గా పొటన్షియలిటీ ఉన్న రౌడీ షీటర్లపై నగరం నుండి బహిష్కరించడం కోసం 8మందిపై పి డి ఆక్ట్ పెట్టి కలెక్టర్ కు పంపినట్లు తెలిపారు. త్వరలో వాళ్లకు నగర బహిష్కరణ ఉంటుందని తెలిపారు. చట్టాన్ని కొంతమంది తమ చేతుల్లోకి తీసుకొని ఇష్టమొచ్చినట్లు ప్రవర్తిస్తున్నారని ఆలా చేసిన వారు ఎంతటి వారైనా, ఏ పార్టీకి చెందిన వారైనా ఉపేక్షించబోమని హెచ్చరికలు జారీ చేశారు.
పోలీసులు నిస్పక్షపాతంగా పనిచేస్తారని మీ మీ గ్రూప్ ల ఆధిపత్యం కోసం పోలీసులపై నిందారోపణ చేయడం సరికాదన్నారు. చైన్ స్నాచర్లు, బ్లేడ్ బ్యాచ్, గంజాయి స్మగ్లర్లపై ప్రత్యేక ద్రుష్టి సారించినట్లు తెలిపారు. రాజమండ్రి ప్రశాంత ప్రాంతమని ఆ ప్రశాంతత కాపాడడం కోసం అన్ని వర్గాల ప్రజలు, రాజకీయ పార్టీలు, కుల సంఘాలు సహకరించాల్సిందిగా కోరారు.