ప్రజాస్వామ్య వ్యవస్థకు కీలకమైన ఎన్నికల ప్రక్రియలో విద్యార్ధి దశలో ఉన్న యువకులు ఎక్కువగా పాలుపంచుకోవడానికి సి బి ఐ టి కాలేజీలో కొత్త ప్రయోగం చేస్తున్నారు. సి బి ఐ టి కళాశాల లో నేడు ఎన్నికల అక్షరాస్యత క్లబ్ ‘ప్రజాస్వామ్య గోడ’ అనే కార్యక్రమం నిర్వహించారు. ప్రజాస్వామ్యం పై విద్యార్థులు మరియు అధ్యాపకుల అభిప్రాయ సేకరణ కోసం కార్యక్రమం నిర్వహించారు.
ఈ కార్యక్రమం ద్వారా విద్యార్థులు మన దేశ ప్రజాస్వామ్యం పై గల అభిప్రాయాలు గోడ మీద వ్రాసి తెలిపారు. ఎన్నికల ప్రక్రియలలో విద్యార్ధి దశలో ఉన్న యువకుల భాగస్వామ్యాన్ని పెంపొందించడానికి ఉద్దేశించిన కార్యక్రమం అని కళాశాల ప్రిన్సిపాల్ ప్రొఫెసర్ పి రవీందర్ రెడ్డి తెలిపారు. అమెరికా మాజీ అధ్యక్షుడు అబ్రహం లింకన్ నిర్వచించిన విధంగా ప్రజల చేత, ప్రజల కొరకు, ప్రజలే ఎన్నుకొనే ప్రభుత్వ విధానాన్ని ప్రజాస్వామ్యం అంటారు అని ఎక్కువ మంది వ్రాసారు.
ఎంత ప్రజాస్వామ్య దేశంలోనైనా నూటికి నూరు శాతం ఏకాభిప్రాయాన్ని ఆశించలేం. మెజారిటీ ప్రజల అభిప్రాయాన్ని గౌరవించి అందరూ అమలు చేయడం ప్రజాస్వామ్యంలో అనుసరించాల్సిన పద్ధతి అని కూడా వ్రాసారు. ప్రజాస్వామ్యంలో ఎవరు అయినా నాయకుడు కాగలరు అని ఎన్నికల అక్షరాస్యత క్లబ్ స్టాఫ్ సమన్వయకర్త డాక్టర్ జి ఎన్ ఆర్ ప్రసాద్ తెలిపారు. ఈ కార్యక్రమానికి విద్యార్థి సమన్వయకర్తలు గా కౌశిక్, జయంత్, ఈశ్వరాదిత్య, సందీప్ వ్యవహరించారు.