బెంగళూరులో మజ్లీస్ పార్టీ నిన్న నిర్వహించిన బహిరంగ సభలో ‘ పాకిస్థాన్ జిందాబాద్’ అంటూ నినాదాలు చేసినందుకు అముల్యా లెనాను పోలీసులు అరెస్టు చేసి న్యాయస్థానంలో ప్రవేశపెట్టగా 14 రోజుల జ్యూడిషియల్ కస్టడీకి అప్పగించారు. దక్షిణ బెంగలూరు లోని ఒక కళాశాలకు చెందిన విద్యార్ధి నాయకురాలు అముల్యా పౌరసత్వ (సవరణ) చట్టం (CAA) కు వ్యతిరేకంగా నిరసన బహిరంగ సభలో ఆమె నాలుగు సార్లు పాకిస్తాన్ జిందాబాద్ అని నినాదాలు చేసింది.
“సేవ్ కాన్ స్టిట్యూషన్ ” అనే అంశంపై మాట్లాడాలని ఆమెను ఈవెంట్ ఆర్గనైజర్లు పిలిచారు. అయితే ఆమె వేదిక పైకి రాగానే ఈ నినాదాలు చేసింది. దాంతో వేదికపై ఉన్న మజ్లీస్ అధినేత ఒవైసీ మరి కొందరు కలిసి ఆమె నుంచి మైక్రోఫోన్ ను లాక్కోవడానికి వెళ్లగా, ఆమెను ఆపడానికి మరికొందరు ప్రయత్నించారు. అనంతరం పోలీసులు రంగంలోకి దిగి ఆమెను స్టేజీ నుంచి పక్కకు తీసుకువెళ్లారు.
ఆ తర్వాత ర్యాలీని ఉద్దేశించి ప్రసంగించిన ఒవైసీ తన పార్టీ కి ఆ యాక్టివిస్టుకు సంబంధం లేదని చెప్పారు. మేం బతికున్నంత కాలం భారత్ జిందాబాద్ అనే నినాదాన్ని మాత్రమే చేస్తామని అన్నారు. తమకు పాకిస్తాన్ తో తమకు సంబంధం లేదు, ఎప్పటికీ ఉండదు అని ఆయన చెప్పారు.