ఎవడి గోల వాడిది. ఎవరు చస్తే మాకేంటి మా మూఢ నమ్మకమే మాకు బలం అంటున్నారు… వీరు. అదేమిటంటే… కరోనా వస్తే మంత్రించిన కొబ్బరి నూనె తలకు రాసుకుంటే తగ్గిపోతుందట. అలా అని మంత్రించిన కొబ్బరి నూనె కోసం ఎవరూ ఎక్కడికి వెళ్లక్కరలేదు.
కరోనా వార్డులో చేరితే వాళ్లే వచ్చి నెత్తికి పూసి పోతారు…. నిజం.. నమ్మడం లేదా? అయితే కాకినాడ ప్రభుత్వ ఆసుపత్రి కరోనా వార్డ్ లోకి వచ్చి ఒక సారి చూడండి. కొబ్బరి నూనె డబ్బాలతో వచ్చి తనకు రాస్తున్నారు. తమ వద్ద ఉన్నది యేసు నామమున మంత్రించిన నూనె అని, ప్రభువును నమ్ముకొని ఈ మంత్రించిన నూనె రాసు కుంటే కరోనా పోతుందని వారు చెబుతున్నారు.
కాకినాడ ప్రభుత్వ ఆసుపత్రిలో అధికారికంగానే తాము వచ్చామని చెబుతూ వారు యథేచ్ఛగా తిరుగుతున్నారు. చేతికి గ్లవుజెస్ కూడా లేకుండా కరోనా రోగులందరికి ఒకే చేత్తో కొబ్బరి నూనె రాస్తున్నారు. అదే చేత్తో కరోనా రాని వారికి కూడా పూస్తున్నారు.
యేసును నమ్ముకుని కొబ్బరి నూనె పూయించుకోవాలని వారు కోరుతూ ఉన్నారు. కొందరు యువకులు దీనికి అభ్యంతరం చెబితే తాము ఆసుపత్రి అధికారులకు తెలిసే ఈ పని చేస్తున్నామని బుకాయిస్తున్నారు.
కొసమెరుపు ఏమిటంటే ……. విశాఖపట్నం జిల్లా యలమంచిలి ప్రాంతంలోని మునగపాక మండలం నాగులాపల్లిలో రెండు రోజుల కిందట ఒక కుటుంబంలో గంటల వ్యవధిలో ఇద్దరు మరణించారు. ఒకరు కరోనాతో మృతి చెందగా మరొకరు శ్వాసకోశ వ్యాధితో మరణించారు.
వీరిద్దరూ మామా కోడళ్లు కావడం గమనార్హం. వీరు నాగులాపల్లి కల్వరి కింగ్ డమ్ పీస్ టెంపుల్ చర్చిలో పాస్టర్లుగా పని చేస్తున్నారు. కె డానియల్ (65) ఆయన కోడలు ఎప్పిబాకుమారి (35) అనే ఈ ఇద్దరూ సువార్త స్వస్థత కొబ్బరి నూనె వ్యాపారం చేసేవారు.
సువార్త కొబ్బరి నూనె తయారు చేసే వారే చనిపోయారు…. మరి ఆ నూనె రాసుకుంటే కరోనా రోగులు ఎలా బతుకుతారో…..