నిరాశ్రయులైన వారిని ఆదరించి అన్నం పెట్టాలని ములుగు, భూపాలపల్లి జిల్లాల సబ్ రిజిస్ట్రార్ తస్లీమా మహమ్మద్ పిలుపునిచ్చారు. మతిస్థిమితం కోల్పోయిన ఓ అనాథ యువకుడిని చేరదీసిన ఆమె ఆదరించారు.
శుభ్రంగా స్నానం చేయించి కొత్త బట్టలు ఇచ్చారు. అనంతరం అతడికి కడుపు నిండా అన్నం పెట్టారు. అనాథ యువకుడి గురించి సర్వర్ పౌండేషన్ సభ్యులు ఫోన్ ద్వారా సమాచారం అందించడంతో ఆమె అతడిని ఆదుకున్నారు.
మతి స్థిమితం లేని అతడు తన వివరాలు కూడా చెప్పలేకపోతున్నాడు.ఈ సందర్భంగా తస్లీమా మాట్లాడుతూ ఆకలితో అలమటిస్తూ ఎవరు కనబడినా ఎలాంటి ప్రతిఫలాపేక్ష లేకుండా అన్నం పెట్టాలని పిలుపునిచ్చారు. ఇతరుల ఆకలిని తీర్చడంలో ఉన్న సంతృప్తి మరెక్కడా దొరకదని ఆమె అన్నారు.