రైతుల ఆత్మహత్యలే కాదు మన దేశంలో వ్యాపారవేత్తల ఆత్మహత్యలు కూడా సాగుతున్నాయి. నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో ప్రకారం 2018 సంవత్సరంలో వ్యాపారవేత్తల ఆత్మహత్యలలో 2.7 శాతం పెరుగుదల కనిపించింది. ఆ ఏడాది దాదాపు 8 వేల మంది వ్యాపారవేత్తలు ఆత్మహత్య చేసుకున్నట్లు నివేదిక తెలిపింది.
కర్ణాటకలో అత్యధిక వ్యాపారవేత్తల ఆత్మహత్యలు జరిగాయి. అక్కడ మొత్తం 1113 మంది ఆత్మహత్య చేసుకున్నారు. మహారాష్ట్రలో 969 మంది, తమిళనాడులో 931 మంది ఆత్మహత్యలు చేసుకున్నారు. జిడిపి అత్యధికంగా ఉన్న మూడు రాష్ట్రాలు ఇవి కావడం గమనార్హం. నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో ప్రకారం, 2015 లో 8780 మంది వ్యాపారవేత్తలు ఆత్మహత్య చేసుకున్నారు. 2016 లో ఇది తగ్గి 8573 కు చేరింది. ఇది 2017 లో మళ్లీ 7778 కు పడిపోయింది.
కానీ 2018 లో ఇది 7990 వరకు ఉంది. 4970 ఆత్మహత్యలు అప్పుల కారణంగా జరిగాయి. ఆత్మహత్యలు చేసుకుంటున్న వారిని పరిశీలిస్తే రెండవ ప్రధాన కారణం కుటుంబ సమస్యలు గా తేలింది. 2017 లో 30.1 శాతం మంది ఆత్మహత్యలు కుటుంబ సమస్యల వల్ల చేసుకోగా, 2018 లో ఇది 30.4 శాతంగా ఉంది. అనారోగ్యం, వైవాహిక సమస్యలు, మద్యపానం, శృంగార సంబంధాలు అంశాలు కూడా ఆత్మహత్యకు దారితీశాయి.