ఆదిలాబాద్ జిల్లా తలమడుగు మండలం దేగామ గ్రామంలో విషాదం చోటు చేసుకుంది. తమ ప్రేమను కుటుంబీకులు అంగీకరించడం లేదనే కారణంతో మంగళవారం ఓ యువజంట పురుగుల మందు తాగి బలవన్మరణానికి పాల్పడింది.
వివరాల్లోకి వెళితే … దేగామ గ్రామానికి చెందిన గోడం శ్రీరాం (25), గేడం సుజాత (19) లు గత కొంత కాలంగా ప్రేమించుకుంటున్నారు. వీరి గ్రామం, కులాలు సైతం ఒక్కటే. అయితే వీరి ప్రేమను కుటుంబీకులు అంగీకరించకపోవడంతో సోమవారం ఉదయం ఇంటి నుంచి వెళ్లీపోయారు.
రాత్రి వరకు తిరిగి ఇంటికి రాకపోవడంతో ఆందోళనకు గురైన ఇరు కుటుంబీకులు గ్రామ పరిసరా ప్రాంతాల్లో వారి కోసం తీవ్రంగా గాలించారు. అయినా ఎక్కడా వారి ఆచూకి కన్పించలేదు.
మంగళవారం ఉదయం 5గంటల ప్రాంతంలో గ్రామ శివారులోని పంట పోలంలో ఓ జంట పడి ఉండటాన్ని గమనించిన స్థానికులు గ్రామస్థులకు సమాచారమందించారు. మృతుల కుటుంబీకులతో పాటు గ్రామస్థులు హుటాహుటిన ఘటన స్థలానికి వచ్చి చూడగా వారు పురుగుల మందు తాగి అపస్మారక స్థితిలో పడి ఉండటాన్ని గమనించారు.
హస్పిటల్కు తరలించేందుకు ప్రయత్నించగా అప్పటికే శ్రీరాం చనిపోయాడు. అపస్మారక స్థితిలో ఉన్న సుజాతను జిల్లా కేంద్రంలోని రిమ్స్ హస్పిటల్కు తరలించగా అక్కడ చికిత్స పొందుతూ ఆమె కూడా మృతి చెందింది.
దీంతో ఇరు కుటుంబాల్లో తీవ్ర విషాదం నెలకొనగా యవ జంట ఆత్మహత్యకు పాల్పడటంతో గ్రామంలోనూ విషాదచాయలు అలుముకున్నాయి. సమాచారమందుకున్న ఎస్సై దివ్యభారతి సంఘటన స్థలాన్ని పరిశీలించి వివరాలను అడిగి తెలుసుకున్నారు.
కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లుగా ఆమె వెల్లడించారు.