రేపు ఉదయం 8.08 గంటల నుంచి ఉదయం 11.16 గంటల వరకు రాబోతున్న సూర్యగ్రహణం తో మిళితమై వస్తున్న షష్టిగ్రహ కూటమి మానవాళిపై పెను ప్రభావం చూపించబోతున్నదని పవిత్ర తిరుపతి క్షేత్రం లో ఉన్న ప్రముఖ జ్యోతిష్య శాస్త్రవేత్త చక్రధర్ సిద్ధాంతి వెల్లడించారు.
ఈ సాయంత్రం 4:41 గంటలకు ప్రారంభమైన ఈ షష్టిగ్రహ కూటమి 27 వ తేది రాత్రి 11:40 వరకు ఉంటుంది. 142 సంవత్సరాలకు ఒక సారి వచ్చే ఈ షష్టిగ్రహ కూటమి దేశంలో కల్లోలం రేపే పలు చర్యలకు కారణభూతం కాబోతున్నదని ఆయన జోశ్యం చెప్పారు. సత్యం న్యూస్ తో మాట్లాడిన ఆయన దేశంలో, రెండు తెలుగు రాష్ట్రాలలో జరగబోయే పెనుమార్పులను విశ్లేషించారు.
ఈ షష్టిగ్రహ కూటమి ప్రభావం రాబోయే 30 రోజుల పాటు ఉంటుందని తత్ఫలితంగా దేశం లో అల్లకల్లోల పరిస్థితులు నెలకొంటాయని ఆయన అన్నారు. గురు ,శని ,కేతు ,బుధ , రవి ,చంద్ర గ్రహాలు ధనస్సు రాశిలో కలుస్తున్నాయని ఆయన అన్నారు. ఈ కలయిక వల్ల గ్రహస్థానాలను బట్టి ఆయా రాశుల వారికి శుభ , అశుభ , మిశ్రమ ఫలితాలు కలుగుతాయని అన్నారు.
ఈ ఫలితాల ప్రభావం ఈ నెల 15 వ తేదీ నుండి వచ్చే నెల అంటే 2020 జనవరి 26 తేదీ వరకు ఉంటుందని సిద్ధాంతి వివరించారు. జ్యోతిష్య శాస్త్రం దైవ సంబంధమైనదని అందువల్ల ఎలాంటి ఫలితాలు ఉన్నపటికీ ఆందోళన పడవలసిన పనిలేదని, ముందుగానే గ్రహ ప్రభావాలు తెలుస్తున్నాయి కాబట్టి జాగ్రత్తలు తీసుకుని దైరవారాధన చేస్తే పరిష్కారం లభిస్తుందని ఆయన స్పష్టం చేశారు.
రావణుడు జన్మించినపుడు అష్టగ్రహ కూటమి ఆవిర్భవించి అరిష్టం జరిగిందని అదే రకమైన ఫలితాలతో ఇప్పుడు షష్టి గ్రహ కూటమి ఏర్పడుతున్నదని ఆయన అన్నారు. దేశ వ్యాప్తంగా రానున్న రోజుల్లో వ్యక్తుల మధ్య వైషమ్యాలు పెరిగే అవకాశం ఉందని, మతాల మధ్య అపోహలతో అశాంతి చెలరేగే అవకాశం ఉందని ఆయన అంచనా వేస్తున్నారు.
రైలు, రోడ్డు ప్రమాదాలతో బాటు పెను ఉపద్రవాలు దేశాన్ని అతలాకుతలం చేసే ప్రమాదం ఉందని చక్రధర్ సిద్ధాంతి హెచ్చరించారు. నూతనత్వం కోసం వెంపర్లాడే యువత మరింత చెడుమార్గంలోకి వెళ్లేందుకు బీజం పడుతుందని, కొత్త టెక్నాలజీ వెంట వెళ్లే నవతరం దైవ భక్తి కి దూరం అవుతారని ఆయన చెప్పారు. రెండు తెలుగు రాష్ట్రాలలో కూడా అశాంతి ఛాయలే కనిపిస్తున్నాయని ఆయన అన్నారు.
తెలంగాణ లో ఆర్ధిక పరిస్థితులు ప్రజలపై పెను ప్రభావం చూపించే అవకాశం ఉందని, ఆంధ్రప్రదేశ్ లో ఇప్పుడు చెలరేగుతున్న ఆందోళనలు చల్లారే అవకాశం లేకపోగా మరింతగా పెరుగుతాయని సిద్ధాంతి అంచనా వేశారు. సంభవించబోతున్నది కేతు సంగ్రస్థ గ్రహణం కాబట్టి దుర్దినాలు పొంచి ఉంటాయని ఆయన అన్నారు.
సౌరయాగాలు చేయడం ద్వారా కొంత మేరకు ఉపశమనం కలిగే అవకాశం ఉందని ఆయన అన్నారు. రాసుల వారీగా గ్రహణానంతర ఫలితాలు ఈ విధంగా ఉంటాయని చక్రధర్ సిద్ధాంతి వివరించారు.
మేషరాశి: 9 వ స్థానం లో గ్రహ కూటమి కారణంగా మిశ్రమ ఫలితాలు వున్నాయి. జాగ్రత్తలు: నూతన ఆలోచనలు చేయకండి, వ్యవహారం లో మార్పులు జరుగుతాయి, సహనంతో వుండండి, ఇష్టదేవత ఆరాధన చేయండి.
వృషభం: 8 వ స్థానం లో గ్రహకూటమి అశుభ స్థానం. ప్రయాణాలు చేయకండి, ఆరోగ్యస్థితికి సంబంధించిన జాగ్రత్తలు తీసుకోండి, ధన నష్టం. జాగ్రత్తలు:దుర్గాదేవిని ఆరాధించండి.
మిధున రాశి:7 వ స్థానం లో గ్రహకూటమి. సామాన్య ఫలితాలు, చికాకు, వైరాగ్యం కలుగుతుంది, ఆందోళన, వ్యాపారం జాగ్రత్తగా చూసుకోండి, పుణ్యయాత్ర చేయండి, జాగ్రత్తలు: పెసలు దానం చేయండి.
కర్కాటకం: 6 వ స్థానం లో గ్రహకూటమి. శుభస్థానం, ఆర్థిక లాభం, సుఖం, బంధు కలహం ఉంటుంది. జాగ్రత్తలు:బియ్యం తెల్లవస్త్రం దానం చేయండి.
సింహ రాశి:5 వ స్థానం గ్రహకూటమి. ప్రతికూలము. శత్రుపీడ, అనారోగ్యం, నిందలు. జాగ్రత్తలు: మినుములు, గోధుమలు దానం చేయండి, ఇష్టదేవతారాధన చేయండి.
కన్యారాశి:4 వ స్థానం లో గ్రహకూటమి. ప్రతికూలము. ఆర్థిక ఇబ్బంది, మానసిక ఆర్థిక శారీరక ఇబ్బంది, సామాన్య జీవితం గడపండి. జాగ్రత్తలు: హనుమాన్ చాలీసా చదవండి.
తులారాశి:3 వ స్థానం గ్రహకూటమి.శుభం. ఆగిన పనులు జరుగుతాయి, కీర్తి, వస్తు, ధన ప్రాప్తి. జాగ్రత్తలు: లక్ష్మి దేవిని పూజించండి.
వృశ్చికం:2 వ స్థానం గ్రహకూటమి. ప్రతికూలం. కలహం, అప్పుల బాధ, కంటి సమస్య, అధిక ఖర్చు. జాగ్రత్తలు:కాలభైరవ పూజ చేయండి.
ధనస్సు:1 వ స్థానం గ్రహకూటమి. ప్రతికూలం. శ్రమ అధికం, ఆర్థిక మానసిక శారీరక ఇబ్బంది. జాగ్రత్తలు: నవగ్రహస్తోత్రం, మృత్యుంజయ స్తోత్రం చదవండి.
మకరం:12 వ స్థానం గ్రహకూటమి. వ్యయస్థానం, ప్రతికూలం, బంధు కలహం, ఇష్టం లేని వ్యవహార భారం. జాగ్రత్తలు:హనుమాన్ చాలీసా చదవండి.
కుంభం:11 వ స్థానం గ్రహకూటమి. శుభం, లాభస్థానం, విశేషాయోగం ఉంటుంది. జాగ్రత్తలు:శివారాధన చేయండి.
మీనరాశి:10 వ స్థానం గ్రహకూటమి. కర్మస్థానం. మిశ్రమ ఫలితాలు, శ్రమ అధికం, చికాకు, కోపం ఉంటాయి, ఆందోళన అధికం. జాగ్రత్తలు: దత్తాత్రేయ ఆరాధన చేయండి.
శుభ ఫలితాలు :కర్కాటక , తులా , కుంభ రాశులకు. మిశ్రమ ఫలితాలు: మేష, మిధున, సింహ, మీన రాశులకు. అశుభ ఫలితాలు :వృషభ, కన్య, వృచ్ఛిక, ధనస్సు, మకర రాశులకు.
కొంత వరకు ఈ గ్రహ కూటమి వల్ల ఎక్కువగా ఇబ్బందులు పడవలసి వచ్చినప్పటికీ నిత్యమూ దైవదర్శనం , దైవప్రార్థన చేస్తూ ఓపికగ వుండి సత్ప్రవర్తన తో మెలిగితే శుభాలను పొందవచ్చును. శత్రువుతో కూడా ప్రేమగా మెలగ గలరు పంటలకు పట్టింపులకు పోకుండా సహనం పాటించగలరు.
-చక్రధర్ సిద్ధాంతి