లోక సంక్షేమం కోసం శ్రీవారిని ప్రార్థిస్తూ వసంత మండపంలో నిర్వహిస్తున్న షోడశదిన సుందరకాండ దీక్షలో భాగంగా రెండవ రోజైన మంగళవారం ఉదయం మూడవ సర్గ నుండి ఆరవ సర్గ వరకు ఉన్న 152 శ్లోకాలను వేద శాస్త్ర పండితులు అత్యంత దీక్షా శ్రద్ధలతో పారాయణం చేశారు.
షోడషాక్షరి మహామంత్రం ప్రకారం రెండవ రోజు ఘ అనే అక్షరానికి ఉన్న బీజాక్షరాల ప్రకారం సుందరకాండలోని 3వ సర్గలో 52, 4వ సర్గలో 29, 5వ సర్గలో 27, 6వ సర్గలో 44 కలిపి మొత్తం 152 శ్లోకాలను పారాయణం చేశారు. ఇందులో భాగంగా మొదట సంకల్పంతో ప్రారంభించి శ్రీరామ ప్రార్థన, శ్రీ ఆంజనేయ ప్రార్థన, శ్రీ వాల్మీకి ప్రార్థన చేశారు. బుధవారం నాడు 7వ సర్గ నుండి 10వ సర్గ వరకు మొత్తం 153 శ్లోకాలను పారాయణం చేయనున్నారు.
ధర్మగిరి వేద పాఠశాల ప్రిన్సిపాల్ ఆచార్య కుప్పా శివసుబ్రహ్మణ్య అవధాని ఆధ్వర్యంలో వసంత మండపంలో 16 మంది వేద శాస్త్ర పండితులు పరాయణం చేశారు. అదేవిధంగా ధర్మగిరి వేద పాఠశాలలో మరో 16 మంది వేద శాస్త్ర పండితులు జప – తర్పణ – హోమాదులు నిర్వహించారు.
ప్రపంచవ్యాప్తంగా ఉన్న శ్రీవారి భక్తుల కోసం ప్రతిరోజూ ఉదయం 8.30 గంటల నుండి ఈ కార్యక్రమాన్ని ఎస్వీబీసీలో ప్రత్యక్ష ప్రసారం చేశారు.