సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాది, సుప్రీంకోర్టు బార్ అసోసియేషన్ అధ్యక్షుడు దుష్యంత్ దవే పరోక్షంగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వై ఎస్ జగన్ మోహన్ రెడ్డిని సమర్థించారు. సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ ఎన్ వి రమణను, ఆంధ్రప్రదేశ్ హైకోర్టుకు చెందిన కొందరు న్యాయమూర్తులను తీవ్రంగా ఆక్షేపిస్తూ వై ఎస్ జగన్ సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తికి లేఖ రాసిన విషయం తెలిసిందే.
ఈ లేఖ ను సుప్రీంకోర్టు బార్ అసోసియేషన్ తీవ్రంగా ఖండించింది. సుప్రీంకోర్టు బార్ అసోసియేషన్ కార్యనిర్వాహక కమిటీ సమావేశమై ఈ విధంగా ముఖ్యమంత్రి లేఖ రాయడం వాంఛనీయం కాదని అభిప్రాయపడింది. ఈ సమావేశానికి గైర్హాజరైన దవే ఆ తర్వాత ఒక ప్రకటన విడుదల చేస్తూ కార్యనిర్వాహక కమిటీ చేసిన తీర్మానంపై తనకు అభ్యంతరాలు ఉన్నాయని తెలిపారు.
ఈ విధంగా ముఖ్యమంత్రి లేఖను ఖండించడం కరెక్టు కాదని ఆయన అన్నారు. ఆ లేఖపై విచారణ జరిపి నిజానిజాలు తేలిన తర్వాత వ్యాఖ్యానిస్తే బాగుండేదని ఆయన అభిప్రాయపడుతున్నారు. ముఖ్యమంత్రి చేసిన ఆరోపణలలో వాస్తవం ఉందా లేదా అనే విషయం తెలియకుండా ఒక అభిప్రాయానికి రావడం కరెక్టు కాదని ఆయన అన్నారు.