హైదరాబాద్ లో సుప్రీంకోర్టు బెంచ్ ఏర్పాటు కాబోతున్నదా? ఈ ప్రశ్నకు అవుననే సమాధానం వినిపిస్తున్నది. సుప్రీంకోర్టుపై పెరిగిపోతున్న కేసుల భారాన్ని తగ్గించేందుకు దేశంలో నాలుగు సుప్రీంకోర్టు బెంచ్ లు ఏర్పాటు చేయాలని అటార్నీ జనరల్ కె కె వేణుగోపాల్ సూచించడంతో అవి ఎక్కడ ఏర్పాటు కాబోతున్నాయనే విషయం చర్చనీయాంశమైంది.
రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా అటార్నీ జనరల్ కే కే వేణుగోపాల్ ఈ ప్రతిపాదన చేయగా కేంద్ర ప్రభుత్వం కూడా ఈ అంశాన్ని పరిగణనలోకి తీసుకోవచ్చునని తెలిసింది.
కేవలం జాతీయ ప్రాధాన్యం ఉన్న కేసులు, రాజ్యాంగానికి సంబంధించిన కేసులు మాత్రమే సుప్రీంకోర్టు స్వీకరించాల్సి ఉందని, అయితే మన దేశంలో వివాహ సంబంధిత విషయాలు, రెంట్ కంట్రోల్ కేసులు, భూ వివిధాలు, బెయిల్ కేసులు, భూ సేకరణ కేసులు లాంటి దాదాపు 400 రకాల కేసులు సుప్రీంకోర్టుకు వస్తున్నాయని ఆయన అన్నారు.
ప్రపంచంలోని ఏ దేశంలో కూడా ఈ పరిస్థితి లేదని, అక్కడి ప్రధాన న్యాయాలయాలు కేవలం జాతీయ అంశాలు, రాజ్యాంగ ఉల్లంఘన కేసులను మాత్రమే స్వీకరిస్తాయని కె కె వేణుగోపాల్ పేర్కొన్నారు. ప్రస్తుతం సుప్రీంకోర్టులో ఏటా 75 వేల కేసుల వరకూ భారం పడుతున్నదని దీన్ని కనీసం 25 వేల నుంచి 30 వేల కేసులకు తగ్గించాల్సి ఉందని ఆయన అన్నారు.
అందుకోసం దేశంలోని నాలుగు మూలలా నాలుగు సుప్రీంకోర్టు బెంచ్ లు ఏర్పాటు చేయాలని ఆయన ప్రతిపాదించారు. ఈ ప్రతిపాదనలో ఎక్కడెక్కడ సుప్రీంకోర్టు బెంచ్ లు ఏర్పాటు అవుతాయనే అంశంపై విస్తృతంగా చర్చలు జరుగుతున్నాయి.
అందులో భాగంగా హైదరాబాద్ లో సుప్రీంకోర్టు బెంచ్ ఏర్పాటు కావచ్చునని అంటున్నారు. అదే విధంగా మహారాష్ట్రలోని నాగ్ పూర్ లో, గౌహతిలో, కోల్ కతాలో సుప్రీంకోర్టు బెంచ్ లు ఏర్పాటు కావచ్చుననే ఊహాగాలనాలు వినిపిస్తున్నాయి.