అమరావతి భూముల కుంభకోణానికి సంబంధించిన కేసు దర్యాప్తుపై ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ఇచ్చిన స్టే ఆర్డర్ ను ఎత్తివేసేందుకు సుప్రీంకోర్టు నిరాకరించింది.
ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ జె కె మహేశ్వరి మాజీ అడ్వకేట్ జనరల్ దమ్మాలపాటి నివాస్ దాఖలు చేసిన పిటిషన్ పై స్టే మంజూరు చేసిన విషయం తెలిసిందే.
ఇదే పిటిషన్ కు సంబంధించి సామాజిక మాధ్యమాలలో, ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియాలలో సమాచారం ప్రచురించకుండా రాష్ట్ర హైకోర్టు గ్యాగ్ ఆర్డర్ జారీ చేసింది. ఈ అంశంపై రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించింది.
వాదనలు విన్న సుప్రీంకోర్టు, విచారణపై విధించిన స్టే జోలికి వెళ్లలేదు. ఏపి హైకోర్టు జారీ చేసిన గ్యాగ్ ఆర్డర్ పై మాత్రం స్టే ఇస్తూ జస్టిస్ అశోక్ భూషణ్, ఆర్ సుభాష్ రెడ్డి, ఎం ఆర్ షా లతో కూడిన బెంచ్ ఆదేశాలు జారీ చేసింది.
కేసు విచారణపై స్టే ఇవ్వడం రాష్ట్ర హైకోర్టు చేయాల్సిన పని కాదని రాష్ట్ర ప్రభుత్వం తరపున సీనియర్ న్యాయవాది రాజీవ్ ధావన్ వాదించారు.
రాష్ట్ర హైకోర్టు తన పరిధిని దాటి పిటిషనర్ కోరిన దానికన్నా ఎక్కువగా వెసులు బాటు కల్పించడం అన్యాయమని ఆయన అన్నారు.
ఈ వాదనలను ఖండిస్తూ సీనియర్ న్యాయవాది, మాజీ అటార్నీ జనరల్ ముకుల్ రోహత్గీ తన వాదన వినిపించారు. రాష్ట్ర హైకోర్టు ఆదేశాలు ఇచ్చే సమయానికి ఎఫ్ఐఆర్ నమోదు కాలేదని ఆయన తెలిపారు.
అందువల్ల ఎఫ్ ఐ ఆర్ వివరాలు పిటిషన్ లో ఉండే అవకాశం లేదని ఆయన అన్నారు. ప్రభుత్వం ఉద్దేశ్యపూర్వకంగా ఎఫ్ ఐ ఆర్ ను మీడియాకు లీక్ చేసి మాజీ అడ్వకేట్ జనరల్ పరువు ప్రతిష్టలకు భంగం కలిగే విధంగా ప్రవర్తించిందని అన్నారు.