ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వై ఎస్ జగన్ మోహన్ రెడ్డిని పదవి నుంచి తొలగించాలనే పిటిషన్ ను సుప్రీంకోర్టు తిరస్కరించింది. సుప్రీంకోర్టు సీనియర్ జడ్జి ఎన్ వి రమణపై నిరాధారమైన ఆరోపణలు చేసినందున వై ఎస్ జగన్ మోహన్ రెడ్డికి పదవిలో కొనసాగే అర్హత లేదని ఇద్దరు ప్రాక్టీసింగ్ ఎడ్వకేట్స్ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.
ఈ పిటిషన్ పై విచారణ జరిపిన సుప్రీంకోర్టు న్యాయమూర్తులు జస్టిస్ ఎస్ కె కౌల్, జస్టిస్ దినేష్ మహేశ్వరి, జస్టిస్ హరిసైకేష్ రాయ్ లు పిటిషన్ ను డిస్మిస్ చేశారు. పిటిషనర్లు రెండు అంశాలు లేవనెత్తారని ఈ సందర్భంగా వారు తెలిపారు. ఒకటి సీనియర్ జడ్జి అయిన ఎన్ వి రమణపై తీవ్రాతి తీవ్రమైన ఆరోపణలు చేయడం.
రెండు అలాంటి నిరాధారమైన ఆరోపణలు చేసినందున ముఖ్యమంత్రిగా కొనసాగే వీలులేకుండా చూడాలనడం. మొదటి అంశంలో పిటిషనర్ తాను ఏం కోరుకుంటున్నాడో స్పష్టత లేదని సుప్రీంకోర్టు బెంచ్ వ్యాఖ్యానించింది.
అంతే కాకుండా ఈ అంశాన్ని చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా కు నేరుగా నివేదించినందున ఇక ఈ అంశంపై తాము పిటిషన్ ను విచారించలేమని సుప్రీంకోర్టు న్యాయమూర్తులు వెల్లడించారు. ముఖ్యమంత్రి జగన్ వ్యాఖ్యలు న్యాయ వ్యవస్థపై దాడి లా ఉన్నాయని, అలాంటి వ్యక్తి రాజ్యాంగ పదవిలో ఉండే అర్హత లేదని వారు వాదించారు.