పాకిస్తాన్ బోర్డర్ లో ఉన్న సైనికులకు పాచిపోయిన అన్నం పెడుతున్నారని వీడియో పోస్టు పెట్టి ఆ తర్వాత సర్వీసు నుంచి బయటకు వచ్చిన జవాన్ తేజ్ బహదూర్ యాదవ్ ప్రధాని నరేంద్ర మోడీ వారణాసి ఎన్నికపై వేసిన పిటిషన్ ను సుప్రీంకోర్టు కొట్టివేసింది.
2019 లోక్ సభ ఎన్నికలలో ప్రధాని నరేంద్రమోడీ వారణాసి లోక్ సభ నియోజకవర్గం నుంచి ఎన్నికైన విషయం తెలిసిందే. ఈ ఎన్నికను సవాల్ చేస్తూ తేజ్ బహదూర్ అలహాబాద్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఆ పిటిషన్ ను అలహాబాద్ హైకోర్టు కొట్టివేయడంతో ఆయన సుప్రీంకోర్టుకు అప్పీలుకు వెళ్లారు.
సుప్రీంకోర్టు వాద ప్రతివాదనలు విన్న తర్వాత నేడు పిటిషన్ ను కొట్టివేసింది. సుప్రీంకోర్టులో వాదనలు ముగిసిన తర్వాత కూడా తీర్పు చెప్పేందుకు అభ్యంతరాలు వ్యక్తం చేస్తూ పిటిషనర్ తరపు న్యాయవాది పలు వాయిదాలు కోరారు. అయితే అత్యంత ప్రధాన మైన ఈ విషయంలో తీర్పు చెప్పకుండా ఎక్కువ కాలం వేచి ఉండలేమని సుప్రీంకోర్టు పిటిషనర్ కు తెలిపి నేడు తీర్పును వెల్లడించింది.
అలహాబాద్ హైకోర్టు కేవలం కొన్ని సాంకేతిక కారణాలు చూపించి తమ పిటిషన్ ను కోట్టేయడం ప్రజా ప్రాతినిధ్య చట్టం లోని అధికరణాలను పట్టించుకోకపోవడం పై పిటిషనర్ సుప్రీంకోర్టు లో ఫిర్యాదు చేయగా సుప్రీంకోర్టు అలహాబాద్ హైకోర్టు ఇచ్చిన తీర్పునే ధృవీకరించింది.