రిపబ్లిక్ టివి ఎడిటర్ ఇన్ చీఫ్ అర్నబ్ గోస్వామికి సుప్రీంకోర్టు తాత్కాలిక బెయిల్ మంజూరు చేసింది. ఒక వ్యక్తి ఆత్మహత్యకు పురిగొల్పారనే నేరంపై అరెస్టు అయిన అర్నబ్ గోస్వామి ఈ నెల 4వ తేదీ నుంచి కష్టడీలో ఉన్నారు.
ఇదే కేసుకు సంబంధించి పోలీసులు అరెస్టు చేసిన నితీష్ సర్దా, ప్రవీణ్ రాజేష్ సింగ్ లను కూడా సుప్రీంకోర్టు బెయిల్ పై విడుదల చేసింది.
ఇవ్వాల్సిన డబ్బులు ఇవ్వకపోవడం ఆత్మహత్యకు ప్రేరేపించడం ఎలా అవుతుందో అర్ధం కావడం లేదని కేసు విచారణ సందర్భంగా జస్టిస్ డి వై చంద్రచూడ్ ప్రశ్నించారు.
ఇలాంటి కేసులో బొంబాయి హైకోర్టు జోక్యం చేసుకోకుండా ఎలా ఉన్నదో కూడా అర్ధం కావడం లేదని ఆయన అన్నారు. న్యాయ స్థానాలు జోక్యం చేసుకోకపోతే న్యాయానికి అర్ధం ఉండదని ఆయన అభిప్రాయపడ్డారు.
రాయ్ గడ్ పోలీసులు తక్షణమే అర్నబ్ గోస్వామిని విడుదల చేయాలని జస్టిస్ చంద్రచూడ్, జస్టిస్ ఇందిరా బెనర్జీలతో కూడిన సుప్రీంకోర్టు బెంచ్ ఆదేశాలు జారీ చేసింది.
వ్యక్తి గత స్వేచ్ఛను కాపాడటంలో బొంబాయి హైకోర్టు తీవ్ర నిర్లక్ష్యం వహించిందని ఈ సందర్భంగా న్యాయమూర్తులు ఆక్షేపించారు.