ఆర్థిక పరిస్థితుల ఆధారంగా ఉన్నత విద్య మరియు ఉద్యోగాలలో ఆర్థికంగా వెనుకబడిన వర్గాలకు (EWS) రిజర్వేషన్ సౌకర్యం కల్పించే అంశంపై చేసిన రాజ్యాంగ సవరణ చెల్లుబాటుకు సంబంధించిన అంశంలో సుప్రీం కోర్టు ఉత్తర్వులను రిజర్వ్ చేసింది.
ఈడబ్ల్యూఎస్ కోటాలో 10 శాతం రిజర్వేషన్ల రాజ్యాంగబద్ధతపై సుప్రీంకోర్టు రాజ్యాంగ ధర్మాసనం విచారణ చేపట్టింది. EWS కోటా జనవరి 2019లో 103వ రాజ్యాంగ సవరణ ప్రకారం అమలు చేశారు. ఈ చట్టాన్ని సుప్రీంకోర్టులో సవాలు చేశారు. ఐదుగురు న్యాయమూర్తుల ధర్మాసనం దీనిపై విచారణ చేపట్టింది.
ఎస్సీ, ఎస్టీ, ఓబీసీల్లో కూడా పేదలు ఉన్నారని, అలాంటప్పుడు సాధారణ కేటగిరీ వారికి మాత్రమే ఎందుకు రిజర్వేషన్లు కల్పిస్తారని పిటిషన్లో పేర్కొన్నారు. ఇది 50 శాతం రిజర్వేషన్ నిబంధనను ఉల్లంఘించడమేనని పిటిషనర్లు వాదించారు. ఇప్పటికే ఓబీసీలకు 27 శాతం, ఎస్సీలకు 15 శాతం, ఎస్టీలకు 7.5 శాతం కోటా నిర్ణయించారు. ఈ సందర్భంలో, 10 శాతం EWS కోటా 50 శాతం నియమాన్ని ఉల్లంఘిస్తుందని వారు పిటిషన్ లో పేర్కొన్నారు.
ఈడబ్ల్యూఎస్ కోటాలో జనరల్ కేటగిరీకి హక్కు ఉందని, ఎస్సీ-ఎస్టీ ప్రజలు ఇప్పటికే అనేక రిజర్వేషన్ ప్రయోజనాలను పొందుతున్నారని గత విచారణ సందర్భంగా ప్రభుత్వం సుప్రీంకోర్టులో పేర్కొంది. ప్రధాన న్యాయమూర్తి యుయు లలిత్, జస్టిస్ దినేష్ మహేశ్వరి, జస్టిస్ ఎస్ రవీంద్ర భట్, జస్టిస్ బేల ఎం త్రివేది, జస్టిస్ జెబి పార్దివాలతో కూడిన రాజ్యాంగ ధర్మాసనం ముందు అటార్నీ జనరల్ కెకె వేణుగోపాల్ మాట్లాడుతూ, వెనుకబడిన కులాలు, షెడ్యూల్డ్ కులాలు మరియు షెడ్యూల్డ్ తెగలకు చెందిన ప్రజలు ఇప్పటికే రిజర్వేషన్లకు అర్హులని తెలిపారు.
రిజర్వేషన్ ప్రయోజనాలను పొందడం కోసం చేసే ఈ చట్టం కింద సాధారణ వర్గానికి చెందిన పేదలు ప్రయోజనం పొందుతారని ఆయన అన్నారు. ఈ చట్టం ఆర్టికల్ 15 (6), 16 (6) ప్రకారం ఉందని వేణుగోపాల్ తెలిపారు. ఇది ఆర్ధికంగా వెనుకబడిన వారికి విద్య మరియు ఉద్యోగాలలో రిజర్వేషన్ ఇస్తుందని ఆయన వివరించారు.