జమ్మూ కాశ్మీర్ లో పౌర హక్కుల ఉల్లంఘన జరిగిందని దాఖలైన పిటిషన్లపై కౌంటర్ దాఖలు చేయనందుకు కేంద్ర ప్రభుత్వానికి సుప్రీంకోర్టు అక్షింతలు వేసింది. కేంద్ర ప్రభుత్వం గానీ, జమ్మూ కాశ్మీర్ ప్రభుత్వం గానీ ప్రముఖుల అరెస్టులు, సాధారణ పౌరులపై ఆంక్షలు విధించిన అంశంపై కౌంటర్ దాఖలు చేయకపోవడం ఏమిటని సుప్రీంకోర్టు ప్రశ్నించింది. సుప్రీంకోర్టును సులభంగా తీసుకోవద్దని ఆగ్రహం వ్యక్తం చేసింది. కేంద్ర ప్రభుత్వం, జమ్మూ కాశ్మీర్ ప్రభుత్వం కౌంటర్ దాఖలు చేకపోవడంపై సొలిసిటర్ జనరల్ ను సుప్రీంకోర్టు వివరణ కోరగా లెక్కకు మించినంత మంది జోక్యం చేసుకోవడం వల్ల ఇలా జరిగిందని ఆయన చెప్పారు. వెంటనే కౌంటర్ దాఖలు చేయాలని ప్రభుత్వాలకు హితవు చెప్పాలని సుప్రీంకోర్టు కోరింది. పౌర హక్కులకు భంగం కలిగిందంటూ దాఖలైన పిటీషన్లను సుప్రీంకోర్టు విచారణకు స్వీకరించగా వాటికి రెండు ప్రభుత్వాలు సమాధానం ఇవ్వకపోవడం ఆగ్రహం తెప్పించింది. ప్రవాస భారతీయుడైన తన భర్త ను కారణం చెప్పకుండా నిర్భంధించారని ఆసిఫా ముబిన్ అనే మహిళ దాఖలు చేసిన పిటీషన్ కు ప్రభుత్వం ఎందుకు సమాధానం చెప్పలేదని సుప్రీంకోర్టు నిలదీసింది. నిర్భంధానికి సంబంధించిన ఉత్తర్వులను సంబంధిత వ్యక్తులకు చూపించకపోయినా కనీసం న్యాయస్థానానికి అయినా చూపించాలని పిటిషనర్ల తరపు న్యాయవాది హుజెఫా అహ్మదీ కోరగా న్యాయస్థానం స్పందించింది. నిర్భంధానికి సంబంధించిన అన్ని ఉత్తర్వులనూ తమకు సమర్పించాలని సుప్రీంకోర్టు ఆదేశించింది.
previous post
next post