అవినీతి, ఆశ్రిత పక్షపాతానికి కల్వకుర్తి మునిసిపాలిటీ కేరాఫ్ అడ్రస్ గా మారింది. ఇదే విషయాన్ని కల్వకుర్తి మునిసిపల్ కౌన్సిలర్లు ఆధారాలతో సహా జిల్లా కలెక్టర్ కు ఫిర్యాదు చేశారు. దాంతో ఈ అంశాలపై విచారణ జరిపేందుకు నాగర్ కర్నూల్ జిల్లా అదనపు కలెక్టర్ మను చౌదరి ఆకస్మికంగా తనిఖీ చేశారు.
అధికార పార్టీకి చెందిన మునిసిపల్ ఛైర్మన్ ఇతర నాయకులపై వ్యక్తిగత కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతున్నారని ప్రధాన ఫిర్యాదు. రాజకీయ కారణాలతో ఇతర పార్టీ కౌన్సిలర్ల పై కక్షపూరితంగా వ్యవహరిస్తున్నాడని, మున్సిపల్ ఆఫీస్ ను ఆయనన సొంత ఇల్లు అనుకుంటున్నాడని కూడా కౌన్సిలర్లు తమ ఫిర్యాదులో పేర్కొన్నారు.
అవినీతి చర్యలకు అండా దండా
ప్రజలకు మౌలిక సదుపాయాలు కల్పించే పనులలో కూడా చట్ట విరుద్ధంగా వ్యవహరిస్తున్నాడని దీనికి మునిసిపల్ కమిషనర్ జాకీర్ అహ్మద్ మద్దతు తెలుపుతున్నారని వారు ఆరోపించారు. ఫిర్యాదుతో సోమవారం నాగర్ కర్నూల్ జిల్లా అదనపు కలెక్టర్ మను చౌదరి ఆకస్మికంగా తనిఖీ చేశారు.
ఏడో వార్డ్ కౌన్సిలర్ శ్రీనివాసులు, ఎనిమిదో వార్డ్ లక్ష్మీ రామ్ రెడ్డి వార్డులలో లో డ్రైనేజీ సమస్యలు ,పందుల సమస్యలను అదనపు కలెక్టర్ కు వివరించారు. అదే విధంగా గచ్చు బావి ఫెన్సింగ్ చెన్నకేశవ దేవాలయానికి వచ్చి ఆగిపోయిన రోడ్డు పూర్తి చేయాలని డ్రైనేజీ లో పేరుకుపోయిన మురికిని తొలగించాలని మున్సిపల్ కమిషనర్ కు అదనపు కలెక్టర్ ఆదేశాలు జారీ చేశారు.
అధికార దుర్వినియోగానికి పరాకాష్ట
అదేవిధంగా నాగర్ కర్నూల్ రోడ్డు నుండి గచ్చిబావి వరకు రోడ్డు మీద ఉన్న స్తంభాలను తొలగించాలని తెలిపారు. మున్సిపల్ కమిషనర్ చైర్మన్ కక్షపూరిత వైఖరి అవలంబిస్తూ అధికార దుర్వినియోగానికి పాల్పడుతున్నట్లు గతంలోనే వెలుగు చూసింది. కొన్ని వార్డులలో అధికార పార్టీ నుండి కౌన్సిలర్ గా పోటీ చేసి అపజయం పాలైన వారికి మద్దతు తెలుపుతూ వారిని మున్సిపల్ ఆఫీసు కు ఇతర పనులకు వినియోగించుకుంటున్నారని ఫిర్యాదు.
ఇతర పార్టీలో విజయం సాధించిన కౌన్సిలర్లను పక్కన పెడుతున్నారని ఆరోపణలు బహిరంగంగానే వినిపిస్తున్నాయి. పట్టణ ప్రజలు వారి సమస్యలను విన్నవించడానికి మున్సిపల్ కార్యాలయానికి వెళ్లగా నీవు ఎవరికి ఓటు వేశావు వారిని అడగమని నిర్లక్ష్యంగా సమాధానం ఇస్తున్నారని కూడా ఆరోపణలు ఉన్నాయి.
దళిత కౌన్సిలర్లు ఉన్న వార్డుల ప్రజల సమస్యలను పట్టించుకోవడం లేదని మరికొందరు ఆరోపణలు వ్యక్తం చేస్తున్నారు. ఈ విషయంపై దళిత నాయకులు రాష్ట్రస్థాయి దళిత సంఘాల దృష్టికి తీసుకెళ్లినట్లు తెలుస్తోంది. అదేవిధంగా మిషన్ భగీరథ నీటిని కళ్యాణ్ నగర్ లో నేటికీ పైపు పైపులైన్లు వేయకపోవడంతో కాలనీవాసులు తీవ్ర ఇబ్బందులకు గురి అవుతున్నారు.
పట్టణంలో పలు సమస్యలు ఉన్నా పట్టించుకునే నాధుడే కరువయ్యారు. భారత రాజ్యాంగం ప్రకారం రాగద్వేషాలు పక్షపాత వైఖరి అవలంబించ కుండా పరిపాలన కొనసాగిస్తానని అంతఃకరణ శుద్ధి తో చేసిన దానికి తిలోదకాలిచ్చిన కమిషనర్ పై తగు చర్యలు తీసుకోవాలని పట్టణ ప్రజలు కోరుతున్నారు.