36.2 C
Hyderabad
April 23, 2024 21: 06 PM
Slider ప్రత్యేకం

ఈ నెల 19 తర్వాత సీఎం కేసీఆర్ ఆకస్మిక తనిఖీలు

#Telangana CM KCR

పల్లెలు, పట్టణాల్లో జరుగుతున్న ప్రగతి తీరును, పంచాయతీ రాజ్, మున్సిపాలిటీ అధికారుల పనితీరును పరిశీలించేందుకు 19వ తేదీ  తర్వాత రాష్ట్రవ్యాప్తంగా ఆకస్మిక తనిఖీలను స్వయంగా చేపడతానని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు ప్రకటించారు. పల్లె ప్రగతి పట్టణ ప్రగతి కార్యక్రమాల క్షేత్రస్థాయి పనితీరును సమీక్షించడానికి 13 న అన్ని జిల్లాల అదనపు కలెక్టర్లు, జిల్లా పంచాయతీ అధికారుల( డీపీవో) లతో ప్రగతి భవన్ లో సమావేశాన్ని ఏర్పాటు చేయనున్నామని సిఎం తెలిపారు.

సీజనల్ వ్యాధులను అరికట్టేందుకు ముందస్తు చర్యలను సిద్ధం చేసుకునే చార్టును రూపొందించుకోవాలని, దానికి అనుగుణంగా ప్రతీ సీజన్లో ముందస్తు కార్యాచరణను చేపట్టే సంస్కృతిని ఆయా శాఖల ప్రభుత్వ యంత్రాంగం అభివృద్ధి చేసుకోవాలని సిఎం కెసిఆర్ అధికారులను  ఆదేశించారు. రాష్ట్రంలో కరోనా తగ్గుముఖం పట్టిందని, రాష్ట్రంలో పాజిటివిటీ రేటు 4.7 శాతానికి పడిపోయిందని సిఎం తెలిపారు. కరోనా పూర్తిగా తగ్గిన తర్వాత, త్వరలో మరో విడత పల్లె ప్రగతి, పట్టణ ప్రగతి కార్యక్రమాలను చేపడుతామని సిఎం తెలిపారు. రాష్ట్రంలో పచ్చదనాన్ని పెంచడానికి అటవీ శాఖ ప్రత్యేక కార్యాచరణను కొనసాగించాలని సిఎం ఆదేశించారు.

శుక్రవారం ప్రగతి భవన్ లో.. పల్లె ప్రగతి, పట్టణ ప్రగతి తీరు, అందుకనుగుణంగా.. అదనపు కలెక్టర్లు, డీపీవోలు సహా మున్సిపల్, పంచాయతీ రాజ్ సిబ్బంది పనితీరు, చేపట్టవలసిన చర్యల పై సిఎం కేసీఆర్ ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు.

సమీక్షా సమావేశంలో మంత్రులు కె.తారక రామారావు, ఎర్రబెల్లి దయాకర్ రావు, గంగుల కమలాకర్, ఎమ్మెల్సీ పోచారం శ్రీనివాస్ రెడ్డి, ఎమ్మెల్యే ఎ.జీవన్ రెడ్డి, చీఫ్ సెక్రటరీ సోమేశ్ కుమార్, మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ ప్రిన్సిపల్ సెక్రటరీ అరవింద్ కుమార్, పంచాయతీ రాజ్ ప్రిన్సిపల్ సెక్రటరీ సందీప్ కుమార్ సుల్తానియా, సీఎం సెక్రటరీ స్మితా సభర్వాల్, ఓఎస్డీ ప్రియాంక వర్గీస్, మున్సిపల్ డైరెక్టర్ సత్యనారాయణ, పంచాయతీరాజ్ కమిషనర్ రఘునందన్ రావు తదితరులు పాల్గొన్నారు.

నూతన పంచాయతీ రాజ్, మున్సిపాలిటీ చట్టాలను అమల్లోకి తెచ్చి పల్లెలు, పట్టణాల అభివృద్దికి దేశంలో ఎక్కడా లేనివిధంగా ప్రభుత్వం సహకారం అందిస్తున్నదని, సిఎం అన్నారు. గ్రామాలకు, మున్సిపాలిటీలకు ఆర్థికంగా అండదండలందిస్తూ ఉద్యోగుల భర్తీ చేపట్టి ప్రభుత్వం పూర్తిగా సహకరిస్తున్నదన్నారు. ప్రతినెలా గ్రామాల అభివృద్ధికోసం, రూ. 339 కోట్లు,  మున్సిపాలిటీల అభివృద్ధి కోసం 148  కోట్ల రూపాయలను క్రమం తప్పకుండా విడుదల చేస్తున్నదన్నారు. పంచాయతీ రాజ్ వ్యవస్థలో కింది నుంచి పై స్థాయి వరకు సిబ్బందిని ప్రభుత్వం పూర్తి స్థాయిలో నియమించిందని సిఎం గుర్తు చేసారు. పల్లె ప్రగతి, పట్టణ ప్రగతి కార్యక్రమాలు సత్పలితాలనిస్తున్నాయని, ఇంకా చేరుకోవాల్సిన లక్ష్యాలు మిగిలే వున్నాయని సిఎం తెలిపారు.  నిర్దేశిత బాధ్యతలను నిర్వర్తించడంలో పంచాయతీ రాజ్ ఉద్యోగులు, అధికారులు ఎందుకు వైఫల్యం చెందుతున్నారో తెలుసుకోవాల్సివున్నదని అన్నారు. తాత్సారం జరిగినట్టు నిర్లక్ష్యంతో వ్యవహరించినట్టు తన పర్యటనలో గుర్తిస్తే.. ఎవరినీ క్షమించబోనని సిఎం స్పష్టం చేశారు.

ఇప్పటివరకు గ్రామాలు, మున్సిపాలిటీలల్లో ఎంత వరకు ఏమేమి పనులు జరిగాయో వొక చార్టును రూపొందించాలని సిఎస్ ను ముఖ్యమంత్రి ఆదేశించారు. పల్లె ప్రగతి చార్టును, పట్టణ ప్రగతి చార్టును వేరు వేరుగా  రూపొందించాలన్నారు.

 గ్రామాలు, పట్టణాల్లో జరుగుతున్న ప్రగతిలో భాగంగా…. పారిశుధ్యం, పచ్చదనం, మంచినీటి సరఫరా, రోజువారీ పరిశుభ్రత,  మొక్కల స్థితి, మొక్కలు బతికిన శాతం,  గ్రామసభలు నిర్వహించిన తీరు,  స్థానిక ఎంపీవోలు పాల్గొన్నతీరు, అందులో వారు గ్రామ ప్రగతి కోసం తీసుకున్న చర్యలు, ఎన్నిసార్లు గ్రామ సభలు నిర్వహించారు, గ్రామ ప్రగతి నివేదికల మీద జరిగిన చర్చల సారాంశం వంటి అంశాలను చార్టులో పొందుపరచాలన్నారు. వాటితో పాటు, చెత్తసేకరణ, డంపుయార్డులు, వైకుంఠధామాల నిర్మాణ స్థితి, బోరుబావులు పూడ్చడం, ప్రభుత్వ కార్యాలయాలలో పారిశుధ్య నిర్వహణ, ట్రాక్టర్ల కిస్తులు కడుతున్నతీరు,  కరెంటు బిల్లుల వసూలు, గ్రామ పంచాయితీ ఉద్యోగులకు జీతాలు ఇవ్వడం, డ్రైనేజీలు, నాలాలు క్లీనింగ్, వెజ్ నాన్ వెజ్ మార్కెట్ల నిర్మాణం, వంటి అంశాలను చేర్చాలన్నారు. వాటితో పాటు ఉత్తమ గ్రామాలను, మండలాలను, అధ్వానంగా ఉన్న గ్రామాలు మండలాలను.. గుర్తించడం వాటికి గల కారణాలను ఈ చార్టులో ప్రత్యేకంగా  పేర్కొనాలని సిఎం ఆదేశించారు. అన్ని రకాల అంశాలను పొందుపరిచి వాటిల్లో జరుగుతున్న పురోగతినే కాకుండా వెనుబాటు ను కూడా చార్టు రూపంలో సిద్దం చేయాలని మంచి చెడులను రెండింటిని ప్రాతిపదికగా తీసుకుని చార్టును తయారు చేసి, ఆకస్మిక తనిఖీ పర్యటనలో  తనకు అందచేయాలని సిఎస్ ను ఆదేశించారు.

సీజనల్ వ్యాధులను ముందస్తుగానే అరికట్టేందుకు గ్రామాల్లో ఇకనుంచి సీజన్ వారీగా చార్ట్ తయారు చేయాలని సిఎం అధికారులకు సూచించారు. వానాకాలం సహా శీతాకాలం, ఎండాకాలం మూడు కాలాల్లో వ్యాప్తిచెందే వ్యాధులను గుర్తించి వాటి నివారణకు చేపట్టాల్సిన చర్యలను చార్టు రూపంలో రూపొందించుకోవాలన్నారు. ప్రతి సంవత్సరమూ సీజన్ రాకముందే సంబంధిత వ్యాధుల నివారణకు  ముందస్తు చర్యలు చేపట్టాలన్నారు.

వానాకాలం ప్రారంభమైన నేపథ్యంలో.. ట్యాంకులను శుధ్దిచేసి తాగునీరును అందిచాలన్నారు. కరోనా నేపథ్యాన్ని దృష్టిలో ఉంచుకుని, ఎఎన్ఎం, ఆశా వర్కర్లు సహా వైద్యారోగ్యశాఖ ఉద్యోగులను సమాయత్తపరచాలని వారిని ముందస్తుగానే ప్రతీ సీజన్ లో సీజనల్ వ్యాధులను నివారించే చర్యలకు సిద్దం చేయాలన్నారు.

అభివృద్ది కండ్లకు కనిపించినప్పుడే ప్రజలు ప్రజాప్రతినిధులు వెంట నడుస్తారని ఆ దిశగా ఇప్పటికే విజయం సాధించిన పల్లె ప్రగతి పట్టణ ప్రగతి కార్యక్రమాలు దేశంలోనే ఉత్తమమైనవిగా గుర్తించబడినాయని, ఈనేపథ్యంలో అలసత్వం వదిలి మరింత పట్టుదలతో పనిచేసి తెలంగాణను అద్దంలా తీర్చిదిద్దుకోవాలని సిఎం అధికారులకు స్పష్టం చేశారు. 

Related posts

ఎమ్మెల్సీ ఎన్నికల్లో వాణిదేవికి అన్ని వర్గాల నుంచి సానుకూల స్పందన

Satyam NEWS

మళ్లీ మొదలు:విశాఖ అభివృద్ధికి రూ.394 కోట్లు

Satyam NEWS

గనుల దొంగ కేసు సిబిఐకి బదిలీ

Satyam NEWS

Leave a Comment