నిర్మల్ జిల్లా కేంద్రంలోని ప్రసూతి ఆసుపత్రి లో సాధారణ ప్రసవాలు జరిగేలా వైద్యాధికారులు చూడాలని జిల్లా కలెక్టర్ ముషర్రఫ్ ఫారుఖీ కోరారు. శనివారం రాత్రి నిర్మల్ పట్టణంలోని ప్రసూతి ఆసుపత్రి ని ఆయన సందర్శించారు. ఆస్పత్రిలో ఉన్న పేషంట్లతో వైద్యులు అందిస్తున్న సేవలపై అడిగి తెలుసుకున్నారు. ఆసుపత్రికి వచ్చే గర్భిణులకు సాధారణం కాన్పులు జరిగేలా చూడాలన్నారు. వైద్యులు ఆస్పత్రికి సకాలంలో రావాలన్నారు.
గర్భిణీలకు బాలింతలకు పిల్లలకు ఇబ్బందులు కలగకుండా ఆస్పత్రి ఆవరణలో చుట్టుపక్కల పరిశుభ్రమైన వాతావరణం కల్పించాలన్నారు. కెసిఆర్ కిట్ లను వెంటవెంటనే బాలింతలకు అందించాలన్నారు ఆస్పత్రి ప్రక్కనున్న ఖాళీ స్థలంలో ఉన్న చెత్తను తొలగించాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో జిల్లా అదనపు కలెక్టర్ ఏ భాస్కర్ రావు, జిల్లా ఆసుపత్రి సూపర్డెంట్ డాక్టర్ సురేష్, ప్రసూతి ఆసుపత్రి ఆర్ ఎమ్ ఓ డాక్టర్ రజిని, మున్సిపల్ కమిషనర్ బాలకృష్ణ, డి ఈ సంతోష్ కుమార్, వైద్యులు తదితరులు పాల్గొన్నారు.