బాలివుడ్ హీరో సుశాంత్ సింగ్ రాజ్ పుత్ ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ముంబయిలోని తన బాంద్రా నివాసంలో సుశాంత్ ఉరివేసుకుని ఉండగా ఇంట్లో పని మనిషి పోలీసులకు సమాచారం అందించింది. 34 ఏళ్లు సుశాంత్ ఎం ఎస్ ధోనీ- ది అన్ టోల్డ్ స్టోరీ లో నటించి విశేష పేరు ప్రఖ్యాతులు సంపాదించాడు.
కాయ్ పోఛే, రాబ్తా, డిటెక్టీవ్ బ్యోంకేష్ బగ్సీ లాంటి చిత్రాలతో అతను మంచి నటుడుగా పేరు తెచ్చుకున్నాడు. సుశాంత్ ఆత్మ హత్యకు కారణాలు తెలియలేదు. బాంద్రా పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. కొద్ది రోజుల కిందట సుశాంత్ మాజీ మేనేజర్ దిశా సలియన్ ఆత్మహత్య చేసుకున్నది.
ఆమె ముంబయిలోని జన కళ్యాన్ ప్రాంతంలోని తను నివాసం ఉండే అపార్టుమెంటులో 14వ అంతస్తు నుంచి దూకి ఆత్మహత్యకు పాల్పడ్డది. సుశాంత్ ఇటీవల ఇన్ స్టా గ్రామ్ లో తన అభిమానుల కోసం ఒక సందేశాన్ని ఇచ్చాడు. తాను కొత్తగా కంప్యూటర్ కోడింగ్ నేర్చుకుంటున్నానని, లాక్ డౌన్ సమయంలో అది ఎంతో ఇంటరెస్టింగ్ ఉందని అతను చెప్పాడు.
బీహార్ నుంచి వలస వచ్చిన సుశాంత్ జీవితంలో ఎన్నో కష్టాలను అనుభవించి చివరకు సినీ హీరో అయ్యాడు. బీహార్ లోని పూర్ణియా జిల్లాలో నిరుపేద కుటుంబంలో అతను జన్మించాడు. ఢిల్లీ టెక్నాలజీ యూనివర్సిటీలో అతను మెకానికల్ ఇంజనీరింగ్ పూర్తి చేశాడు. పవిత్ర రిస్తా అనే టీవీ సీరియల్ ద్వారా ప్రేక్షకులకు అతను దగ్గరయ్యాడు. చివరకు అర్ధంతరంగా తనువు చాలించాడు.