ఏం జరిగిందో తెలియదు కానీ ఒక సాఫ్ట్ వేర్ ఇంజనీర్ కుటుంబం మొత్తం మృత్యుదేవతను కౌగలించుకున్నది. ముద్దులొలికే ఏడేళ్ల కూతురు తో సహా భార్యా భర్తా విగత జీవులై కనిపించడంతో ఆ ప్రాంతం అంతా శోకసముద్రంలో మునిగిపోయింది. ఈ దురదృష్టకరమైన సంఘటన సంగారెడ్డి జిల్లా అమీన్పూర్ పరిధిలోని బీరంకూడా లో జరిగింది.
అక్కడి వందననపురి కాలనీలో నివసించే శ్రీకాంత్ గౌడ్ (42), ఆయన భార్య అనామిక (40), కూతురు స్నిగ్ధ (7) అత్యంత అసహజరీతిలో మరణించారు. శ్రీకాంత్ గౌడ్ సాఫ్ట్వేర్ ఇంజనీర్ కాగా ఆయన భార్య అనామిక కార్పొరేట్ స్కూల్లో ఉపాధ్యాయురాలు.
పదేళ్ల క్రితం వీరిద్దరూ ప్రేమించుకుని కులాంతర వివాహం చేసుకున్నారు. రెండ్రోజులుగా ఇంట్లో నుంచి ఎవ్వరూ బయటకురాకపోవడంతో అనుమానంతో వెళ్లి చూస్తే.. ముందు గదిలో భార్య, కూతరు నోట్లోంచి నురగలు, నెత్తురు కక్కుతూ మరణించిన స్థితిలో కనిపించారు. బెడ్రూంలో భర్త ఉరేసుకున్న స్థితిలో కనిపించాడు. భార్య, కూతురుకు విషమిచ్చి చంపి.. అనంతరం శ్రీకాంత్ ఆత్మహత్య చేసుకున్నట్లు భావిస్తున్నారు.
ఎందుకు ఆయన ఇంతటి దారుణానికి ఒడిగట్లు? అనేది సస్పెన్స్గా మారింది. శ్రీకాంత్ స్వస్థలం మేడ్చల్ జిల్లా షామీర్పేట. అనామికది ఓల్డ్ అల్వాల్. వందనపురి కాలనీలో ఇల్లు కొనుక్కుని అక్కడే ఉంటున్నారు. చుట్టుపక్కల వారు అనుమానంతో పోలీసులకు ఫిర్యాదు చేయగా వారొచ్చి ఇంటి తలుపులు బద్దలు కొట్టి చూశారు.
అనామిక, స్నిగ్ధ, శ్రీకాంత్ లకు నుదిటిపై రక్తం బొట్లు ఉన్నాయి. దేవుడి పటాల వద్ద పూజలు చేసిన అనవాళ్లు కనిపించాయి. ఆ పటాలు బోర్లిచి ఉన్నాయి. భార్య, బిడ్డకు తినే ఆహారంలో విషం కలిపి వారు మృతిచెందారని నిర్ధారించుకున్నాక.. దేవుడి పటాలకు పూజలు చేసి, మృతదేహాలకు నెత్తుటి తిలకం దిద్ది శ్రీకాంత్ ఉరేసుకున్నట్లు భావిస్తున్నారు. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేశారు.