ప్రముఖ సామాజిక ఉద్యమకారుడు స్వామి అగ్నివేష్ ఇక లేరు. 80 సంవత్సరాల అగ్నివేష్ గత కొద్ది కాలంగా కాలేయ సమస్యతో బాధపడుతున్నారు. స్వామి అగ్నివేష్ ఆంధ్రప్రదేశ్కు చెందిన వారు. శ్రీకాకుళంలోని సనాతన బ్రాహ్మణ కుటుంబంలో 1939 సెప్టెంబర్ 21న జన్మించారు.
అగ్నివేష్కు నాలుగు సంవత్సరాల వయసు ఉన్నప్పుడు ఆయన తండ్రి కన్నుమూశారు. అనంతరం ప్రస్తుతం ఛత్తీస్గఢ్లో ఉన్న శక్తి అనే రాజ్యంలో దివాన్ అయిన తన తాతవారింట పెరిగారు. న్యాయశాస్త్రం, వాణిజ్యంలో డిగ్రీలు సంపాదించారు. కోల్కతాలోని సెయింట్ జేవియర్స్ కాలేజీలో లెక్చరర్గా పనిచేశారు.
సభ్యసాచి ముఖర్జీ అనే ప్రఖ్యాత న్యాయవాది వద్ద జూనియర్ లాయర్గా పనిచేశారు. ఆ తర్వాత సభ్యసాచి ముఖర్జీ సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ అయ్యారు. 1970లో స్వామి అగ్నివేష్ ఆర్య సభ అనే రాజకీయ పార్టీని స్థాపించారు. ఆర్య సమాజ్ సిద్ధాంతాల మీద ఈ రాజకీయ పార్టీ నడుస్తుంది.
1977వ సంవత్సరంలో అగ్నివేష్ హర్యానా అసెంబ్లీకి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. విద్యాశాఖ మంత్రిగా పనిచేశారు. 1981లో ఆయన మంత్రిగా ఉన్న సమయంలోనే బాండెడ్ లేబర్ లిబరేషన్ ఫ్రంట్ అనే సంస్థను స్థాపించారు. శ్రమదోపిడీకి వ్యతిరేకంగా గళమెత్తారు.
ముఖ్యంగా ఢిల్లీ చుట్టుపక్కల ఉండే క్వారీల్లో కార్మికుల శ్రమదోపిడీకి వ్యతిరేకంగా పోరాడారు. హత్యానేరం ఆరోపణల్లో 14 నెలలు జైలు శిక్ష కూడా అనుభవించారు. 2011వ సంవత్సరంలో దేశవ్యాప్తంగా జరిగిన అవినీతి వ్యతిరేక ఉద్యమంలో అగ్నివేష్ కూడా పాలుపంచుకున్నారు.