రాజకీయ పార్టీలకు కేటాయించిన గుర్తులు వాటి సొంత ఆస్తి కాదని, ఎన్నికల్లో ఏదైనా పార్టీ పనితీరు ఘోరంగా ఉంటే ఆ పార్టీ గుర్తును కోల్పోతుందని ఢిల్లీ హైకోర్టు స్పష్టం చేసింది. తమకు ఇచ్చిన వెలుగుతున్న కాగడా గుర్తును శివసేనలోని ఉద్ధవ్ ఠాక్రే వర్గానికి సైతం కేటాయించడాన్ని సవాలు చేస్తూ సమతా పార్టీ దాఖలు చేసిన పిటిషన్ ను సింగిల్ జడ్జి కొట్టేయగా, ఆ పార్టీ మళ్లీ అప్పీలు చేసింది. ఈ విషయంలో సుబ్రమణ్యంస్వామి వర్సెస్ ఎన్నికల సంఘం కేసులో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సతీష్ చంద్ర శర్మ ధర్మాసనం ప్రస్తావించింది. ఎన్నికల గుర్తు అనేది స్థిరమైనది కాదని, అది ఎలాంటి సంపదను సృష్టించదని పేర్కొంది. ఆయా పార్టీలు గుర్తులను తమ సొంత ఆస్తిలా భావించకూడదని సూచించింది. ఏదైనా పార్టీ పనితీరు దారుణంగా ఉంటే ఆ గుర్తు కోల్పోతుందని 1968 నాటి ఎన్నికల గుర్తుల ఉత్తర్వుల్లో ఉన్న విషయాన్ని ధర్మాసనం గుర్తు చేసింది. 2004లోనే సమతా పార్టీకి గుర్తింపు పోయిందని, కాగడా గుర్తును ఎవరికైనా కేటాయించే హక్కు ఈసీకి ఉంటుందని స్పష్టం చేసింది.
previous post
next post