రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్ మెట్ లో దారుణం జరిగింది. ఆఫీస్ గదిలోకి వెళ్లిన ఒక వ్యక్తి తహశీల్దార్ విజయపై పెట్రోల్ పోసి నిప్పు అంటించాడు. తీవ్రంగా గాయపడిన విజయ అక్కడిక్కడే చనిపోయారు. ఆమెను కాపాడే ప్రయత్నం చేసిన ఆఫీస్ లోని ఇద్దరు సిబ్బందికి తీవ్ర గాయాలు అయ్యాయి. వారిని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. తహశీల్దార్ సజీవ దహనం ఘటన రాష్ట్ర వ్యాప్తంగా రెవెన్యూ ఉద్యోగులలో కలకలం రేపింది. చాలా ప్రాంతాలలో రెవెన్యూ ఉద్యోగులు రోడ్డుపైకి వచ్చి ఆందోళన చేస్తున్నారు. ఈ దుర్ఘటనకు సంబంధించి రంగంలోకి దిగిన పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. విజయ మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. అబ్దుల్లాపూర్ మెట్ లోని తహశీల్దార్ ఆఫీస్ లో విజయ తహశీల్దార్ గా విధులు నిర్వహిస్తున్నారు. ఎప్పటిలాగే సోమవారం(నవంబర్ 4,2019) ఉదయం విజయ ఆఫీస్ కి వచ్చారు. తన సీటులో కూర్చుని ఉన్నారు. మధ్యాహ్నం 1.30గంటల ప్రాంతంలో గుర్తు తెలియని వ్యక్తి ఆఫీస్ లోకి వచ్చాడు. తన వెంట తెచ్చుకున్న పెట్రోల్ ను ఒక్కసారిగా ఆమెపై పోసి నిప్పంటించాడు. మంటలు చెలరేగడంతో విజయ కేకలు వేసుకుంటూ బయటకు వచ్చారు. మంటలు శరీరం మొత్తం వ్యాపించాయి. తీవ్రంగా గాయపడిన విజయ.. కారిడార్ లో కుప్పకూలారు. కాసేపటికే చనిపోయారు. తహశీల్దార్ ఆఫీస్ రోడ్డుపైనే ఉంటుంది. ఈ ఘటన ఆఫీస్ సిబ్బందిని, స్థానికులను షాక్ కు గురి చేసింది. తహశీల్దార్ తో మాట్లాడాలి అంటూ లోనికి వచ్చిన వ్యక్తి ఈ ఘాతుకానికి పాల్పడ్డాడు. పోలీస్ స్టేషన్ కు వెళ్లి నిందితుడు లొంగిపోయాడు. విజయ పై కిరోసిన్ పోసి నిప్పంటించిన వ్యక్తిని కూర సురేష్ గా పోలీసులు గుర్తించారు. అదే మండలానికి చెందిన గౌరిల్లి గ్రామ రైతుగా గా గుర్తించారు.
previous post
next post