మహబూబబాద్ జిల్లా నెల్లికుదూర్ మండల పరిధిలోని నర్సింహుల గూడెం గ్రామంలోని నమ్ముల బిక్షం అనే రైతు వ్యవసాయ భూమిలో అక్రమంగా ప్రవేశించి కజ్జాకు పాల్పడిన జెడ్పిటిసి శ్రీనివాస్ రెడ్డి పైన వెంటనే కేసు నమోదు చేసి, రైతుకు న్యాయం చేయాలని యాదవ హక్కుల పోరాట సమితి జాతీయ అధ్యక్షులు మేకల రాములు యాదవ్ డిమాండ్ చేశారు.
ఆదివారం హైదరాబాద్ లోని రాష్ట్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలొ యాదవుల భూములకు రక్షణ కరువైందన్నారు. ఒకపక్క రాష్ట్ర ప్రభుత్వం యాదవ కులస్తుల అభివృద్ధికి కృషి చేస్తుందని గొప్పలు చెప్పుకుంటూ, మరోపక్క కబ్జాలకు పాల్పడుతున్న తెరాస నాయకులను పెంచి పోషిస్తూ అండగా ఉంటుందన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా తెరాస నాయకులు పేదల భూములను కబ్జాలు చేస్తున్నా రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్, పోలీసులు, అధికారులు చూసి చూడనట్లు వ్యవహరిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. వెంటనే సంబంధిత అధికారులు కబ్జాదారులపై కేసులు నమోదు చేసి, బాధితులకు న్యాయం చేయాలని, అలాగే జెడ్పిటిసి శ్రీనివాస్ రెడ్డిపై
అతని అనుచరులపై చర్యలు తీసుకోవాలని కోరారు. లేని పక్షంలొ రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనలు చేస్తామని హెచ్చరించారు. ఈ సమావేశంలొ యాదవ హక్కుల పోరాట సమితి రాష్ట్ర నాయకులు గుడిగే శ్రీనివాస్ యాదవ్, శ్రీశైలం యాదవ్, వీరేందర్ యాదవ్, మేడ్చల్ జిల్లా నాయకులు ముంత బాబు యాదవ్, మహేష్ యాదవ్, శ్రీనివాస్ యాదవ్ తదితరులు పాల్గొన్నారు.