ఆఫ్ఘనిస్థాన్ కు విమానాలు నడపాలని భారతదేశానికి తాలిబన్లు లేఖ రాశారు. ఆఫ్ఘనిస్తాన్ ఇస్లామిక్ ఎమిరేట్లో కొత్త పాలన భారతదేశానికి రాసిన మొదటి లేఖ ప్రాధాన్యతను సంతరించుకుంది. సివిల్ ఏవియేషన్ డైరెక్టర్ జనరల్ ను ఉద్దేశించి రాసిన ఈ లేఖ ఆఫ్ఘనిస్తాన్ పౌర విమానయాన సంస్థ తాత్కాలిక మంత్రి అల్హాజ్ హమీదుల్లా అఖుంజాదా రాశారు.
కాబూల్ విమానాశ్రయాన్ని ఖతార్ సాంకేతిక సహాయంతో, పునరుద్ధరించుకున్నామని లేఖలో తెలిపారు. ఎయిర్ పోర్టులో కార్యకలాపాలను ప్రారంభించే విషయమై ఇప్పటికే విమానయాన సంస్థలకు నోటీసులు పంపించామన్నారు. భారత్, ఆఫ్ఘనిస్తాన్ మధ్య తిరిగి రాకపోకలు జరగాలని కోరుకుంటున్నామని ఈ లేఖలో పేర్కొన్నారు.
అధికారిక ఎయిర్ లైన్స్ అయిన అరియానా ఆఫ్ఘన్ ఎయిర్ లైన్ , కామ్ ఎయిర్ లైన్ విమాన సర్వీసులను ప్రారంభించాలని కోరారు. భారత్ ఆఫ్ఘనిస్తాన్ దేశాల మధ్య ప్రయాణికుల రాకపోకలు సాగాలని, కమర్షియల్ విమానాల సేవలను కూడా పునరుద్ధరించాలని లేఖలో పేర్కొన్నారు.
భారత్ తన పౌరులను తరలించడానికి చివరిసారిగా ఆగస్టు 21 న కాబూల్ నుండి ఇండియన్ ఎయిర్ ఫోర్స్ విమానాన్ని నడిపింది. ఆఫ్ఘనిస్థాన్ లో ఉన్న భారతీయుల భద్రతపై అప్పుడు ఎంతో ఆందోళన చెందింది. ఇప్పుడు విమాన సర్వీసులను పునరుద్ధరించాలని చేస్తున్న విజ్ఞప్తిపై భారత్ ఏ విధంగా స్పందిస్తుందో వేచి చూడాలి.