ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వై ఎస్ జగన్ మోహన్ రెడ్డి స్థానంలో నేనే ఉంటే……? అని వైసీపీలోని ఏ ఎమ్మెల్యే అయినా ఊహించనైనా ఊహించుకోగలరా? అలా ఊహ వచ్చినా ఏం జరుగుతుందో అందరికి తెలిసిందే.
అయితే నేడు అమరావతి సచివాలయంలో జరిగిన ఒక సంఘటన ఇప్పుడు చర్చనీయాంశం అయింది. రాష్ట్ర పంచాయితీ రాజ్ శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి సచివాలయంలో తనను కలిసిన మీడియా వారితో కొద్ది సేపు ఇష్టాగోష్టిగా మాట్లాడారు.
ఆ సందర్భంగా పలు విషయాలు చర్చకు వచ్చాయి. గ్రామ పంచాయితీ ఎన్నికలలో వైసీపీ రాష్ట్ర వ్యాప్తంగా అన్ని ప్రాంతాలలో స్వీప్ చేసేసిందని మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అన్నారు. అదే పరిస్థితి ఇప్పుడు మునిసిపల్ ఎన్నికలలో కూడా కనిపిస్తున్నదని ఆయన వ్యాఖ్యానించారు.
తానే ముఖ్యమంత్రి జగన్ స్థానంలో ఉంటే ఈపాటికే టీడీపిని ఫినిష్ చేసి ఉండేవాడినని మంత్రి వ్యాఖ్యానించారు. టిడిపిలో గెలిచిన 23 మందిలో అచ్చెన్నాయుడుతో సహా అందరినీ వైసీపీలోకి తెచ్చేసి ఉండేవాడినని ఆయన అన్నారు. అయితే జగన్ ఆ పని చేయలేకపోతున్నారని మంత్రి అన్నారు.
ఇలా మంత్రి వ్యాఖ్యానించడం ముఖ్యమంత్రి జగన్ వేరేపార్టీలలో గెలిచిన ఎమ్మెల్యేలను చేర్చుకోను అని చెప్పిన మాటకు కట్టుబడి ఉన్నారని మంత్రి పొగిడారా? లేక ఇంత ఛాన్సు వచ్చినా తెలుగుదేశం పార్టీని కోలుకోలేని దెబ్బ కొట్టలేని రాజకీయ బలహీనతతో ఉన్నారని మంత్రి వ్యాఖ్యానించారో అర్ధం కాలేదు. ఏది ఏమైనా మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి వ్యాఖ్యలు సంచలనం సృష్టిస్తున్నాయి.