జల్లికట్టు ఆటకు తమిళనాడు సర్కార్ పచ్చ జెండా ఊపింది. ప్రతి ఏటా నిర్వహించే జల్లికట్టుకు ఈ ఏడాది కూడా అనుమతిస్తూ ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి స్టాలిన్ నిర్ణయం తీసుకున్నారు. అయితే, కొవిడ్ మార్గదర్శకాలను తప్పకుండా అనుసరించాలని పేర్కొన్నారు. కరోనా విస్తరిస్తున్న నేపథ్యంలో జల్లికట్టు పోటీలో పాల్గొనే ఆటగాళ్లు, ప్రేక్షకులు మాత్రం తప్పకుండా 2 డోస్ల కరోనా వ్యాక్సిన్ తీసుకుని ఉండాలని ప్రకటించారు.
ప్రతి ఏటా జల్లికట్టుపై వివాదం, హింసాత్మకమైన ఈ పోటీలను నిషేధించాలని కొందరి డిమాండ్ కొనసాగుతుండేది. వీటికి చెక్ పెడుతూ స్వయంగా ముఖ్యమంత్రి నిర్ణయం తీసుకున్నారు. కాగా, మధురై జిల్లాలో ఈనెల 14 నుంచి జల్లికట్టు పోటీలు ప్రారంభంకానున్నాయి. జల్లికట్టు పోటీల్లో పాల్గొనేందుకు కేవలం 300 మందికి మాత్రమే అనుమతి ఉంటుంది.
పోటీలను తిలకించేందుకు 150 మంది ప్రేక్షకులు లేదా 50 శాతం సిట్టింగ్ సామర్ధానికి మించకూడాదని వెల్లడించింది తమిళనాడు సర్కార్. పోటీలకు వచ్చే వారు పూర్తిగా రెండుడోసుల వ్యాక్సిన్ తీసుకోవాలని పేర్కొంది. పోటీల ప్రారంభానికి 48 గంటల ముందు కోవిడ్ నెగిటివ్ సర్టిఫికెట్ వెంట తీసుకుని రావాలని సూచించింది.