తిరుమలలోని మాతృశ్రీ తరిగొండ వెంగమాంబ బృందావనంలో ఆరాధన కేంద్రం ఏర్పాటు చేయనున్నట్లు టిటిడి ఈవో డాక్టర్ కె.ఎస్.జవహర్ రెడ్డి తెలిపారు. తరిగొండ శ్రీ లక్ష్మీనరసింహస్వామివారి ఆలయాన్ని శనివారం ఆయన అధికారులతో కలిసి పరిశీలించారు.
ఈ సందర్భంగా ఈవో మాట్లాడుతూ తిరుమలలోని తరిగొండ వెంగమాంబ బృందావనం వద్ద ఉన్న స్కూల్ను మరొక ప్రాంతానికి మార్చి త్వరలో అక్కడ ఆరాధన కేంద్రం ఏర్పాటు చేయడానికి టిటిడి ప్రణాళికలు రూపొందించిందన్నారు. శ్రీమాన్ తాళ్ళపాక అన్నమయ్య తన కీర్తనలతో స్వామి వారికి లాలి పాడితే , వెంగమాంబ తన కృతులతో స్వామివారికి ముత్యాల హారతి సమర్పించారని చెప్పారు.
ఆమె తన జీవితాన్ని స్వామివారికి అంకితం చేసి, సజీవ సమాధి చెందారని చెప్పారు. తిరుమలలో మాతృశ్రీ తరిగొండ వెంగమాంబ అన్నప్రసాద భవనంలో నిత్యం భక్తులకు అన్నప్రసాదాలు అందిస్తున్నామన్నారు. వెంగమాంబ రచించిన ద్విపద భాగవతాన్ని సంపూర్ణంగా భక్తులకు అందుబాటులోకి తీసుకురావాలని, ఆమె జయంతి, వర్థంతి కార్యక్రమాలను మరింత విస్తృతంగా నిర్వహించాలని ఆయన అధికారులను ఆదేశించారు.
అంతకుముందు తరిగొండ శ్రీ లక్ష్మీనరసింహస్వామివారి ఆలయాన్ని పరిశీలించి, ఆలయంలో నిర్వహించే పూజ కార్యక్రమాలపై అర్చకులతో సమీక్షించారు. అనంతరం ఆలయంలోని శాసనాన్ని పరిశీలించారు.
ఈ కార్యక్రమంలో ఆలయ డెప్యూటీ ఈవో శాంతి, అన్నమయ్య, వెంగమాంబ ప్రాజెక్టుల సంచాలకులు ఆకెళ్ళ విభీషణ శర్మ, సూపరింటెండెంట్ చెంగల్రాయులు, ఇతర అధికారులు పాల్గొన్నారు.