రైతులకు జరుగుతున్న అవమానాలకు నిరసనగా ఈ ఏడాది నూతన సంవత్సర వేడుకలను బహిష్కరిస్తున్నట్లు గుంటూరు జిల్లా నరసరావుపేట నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ ఇన్ చార్జి డాక్టర్ చదలవాడ అరవిందబాబు వెల్లడించారు.
రాష్ట్ర రాజధానికీ 33 వేల ఎకరాలు ఇచ్చిన రాజధాని రైతులను వైసీపీ ప్రభుత్వం సాక్షాత్తు రాష్ట్ర ముఖ్యమంత్రి, మంత్రులు, శాసనసభ్యులు ఎవరికి వారుగా పొంతన లేని విమర్శలతో అవమానాల పాలు చేస్తున్నారని ఆయన అన్నారు.
నిక్షేపంగా ఉన్న రాజధానిని తరలించి 3 రాజధానులను ఏర్పాటు చేస్తామన్న వైసీపీ మంత్రులను, ఎమ్మెల్యేలను ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజానీకం చీదరించుకొంటున్నదని ఆయన అన్నారు. గత 13 నెలలుగా భూములు ఇచ్చిన రైతులను హేళనగా, చులకనగా చూస్తున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.
రాజధానిని స్మశానంగా అభివర్ణించిన మంత్రులకు,ఎమ్మెల్యేలకు వ్యతిరేకంగా 33 వేల ఎకరాలు త్యాగం చేసిన రైతులకు సంఘీభావంగా కొత్త సంవత్సరం వేడుకలను బహిష్కరిస్తున్నట్లు డాక్టర్ చదలవాడ వెల్లడించారు. కేంద్ర ప్రభుత్వం వ్యవసాయ చట్టాలను కూడా తాము వ్యతిరేకిస్తున్నామని ఆయన అన్నారు.