వైసీపీ పాలనలో రాష్ట్రం డ్రగ్స్, అసాంఘిక కార్యకలాపాలకు నిలయంగా మారిందని అమలాపురం పార్లమెంట్ టిడిపి అధ్యక్షురాలు రెడ్డి అనంతకుమారి ఆవేదన వ్యక్తం చేశారు. కొత్తపేట లో ఆమె విలేకరులతో మాట్లాడారు. రాష్ట్రంలో గంజాయి, కొకైన్,హెరాయిన్ విక్రయాలు జోరుగా జరుగుతున్నాయన్నారు.
విజయవాడలోని సీఎం ఇంటి సమీపంలోని అశీ ట్రేడర్స్ పేరుతో ఉన్న కంపెనీ ద్వారా డ్రగ్స్ అక్రమ రవాణా జరుగుతుందన్నారు. ఈ కంపెనీ పేరుతో ఆఫ్ఘనిస్తాన్ నుంచి టాల్కమ్ పౌడర్ అని చెప్పి 21 వేల కోట్ల రూపాయల విలువైన హెరాయిన్ ఆంధ్రప్రదేశ్ కు తరలిస్తుండగా గుజరాత్ పోర్టులో పట్టుబడిందన్నారు.
ఇప్పటికే 72 వేల కోట్ల రూపాయల విలువైన డ్రగ్స్ సరఫరా చేసినట్లు అధికారులు వెల్లడించారని ఆమె చెప్పారు. గుజరాత్ లోని మంద్రా పోర్ట్ లో పట్టుబడ్డ హెరాయిన్ పై వైసీపీ నేతలు భుజాలు తడుముకుంటున్నారని ఆరోపించారు. డ్రగ్స్ మాఫియాతో వైసీపీ నేతలకు సంబంధం లేకపోతే ఎందుకు సీబీఐ విచారణకు ఆదేశించడం లేదన్నారు.
తాలిబన్ నుంచి తాడేపల్లికి దిగుమతి అయిన హెరాయిన్ వెనుక బిగ్ బాస్ ఎవరు అని ప్రశ్నించారు. ల్యాండ్, శ్యాండ్,వైన్ మాఫియాతో వేల కోట్లు సంపాదించిన వైసీపీ నేతలు అవి చాలవన్నట్లు డ్రగ్స్ మాఫియా తెరలేపారని మండిపడ్డారు.
గతంలో డ్రగ్స్ అనేది పెద్ద పెద్ద హోటల్లో ఉండేదని, నేడు వైసీపీ పాలన వచ్చాక కిళ్లీ బడ్డీలు, టీ పాయింట్ లు వద్ద దొరుకుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. డ్రగ్స్ మాఫియా ద్వారా తాడేపల్లి కి ఎన్ని వేల కోట్లు కమిషన్లు వెళుతున్నాయి, అందులో వైసీపీ నేతల వాటా ఎంత అనేది ప్రజలకు సమాధానం చెప్పాలని డిమాండ్ చేసారు.
విశాఖపట్నం, తూర్పుగోదావరి జిల్లాల నుంచి కేరళ, బీహార్, తమిళనాడు, కర్ణాటక, ఛత్తీస్గఢ్, తెలంగాణ రాష్ట్రాలతో పాటు విదేశాలకు కూడా పెద్ద ఎత్తున గంజాయి రవాణా సాగుతోందన్నారు. వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ప్రతి ఏటా సుమారు రూ.7200 కోట్ల మేర రాష్ట్రం నుంచి గంజాయి రవాణా జరుగుతోందని అన్నారు. మత్తు పదార్థాలను ప్రోత్సహించడం అంటే జాతిని నిర్వీర్యం చేయడం, యువత భవిష్యత్తును అంధకారంలోకి నెట్టడమే అన్నారు.