రాష్ట్రంలో ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలకు లకు కొత్త నోటిఫికేషన్ ఇవ్వాలని టిడిపి రాష్ట్ర అధికార ప్రతినిధి డాక్టర్ ఎన్ బి సుధాకర్ రెడ్డి డిమాండ్ చేసారు.
గత ఏడాది నామినేషన్ వేయలేక పోయినవారికి ఎస్ఈసి అవకాశం కల్పించడం ఆహ్వానించతగినదే అయినప్పటికి అందరికి పూర్తి న్యాయం కలిగించడం సాధ్యంకాదని చెప్పారు.
ఎస్ఈసి సూచించిన ఆధారాలు చూపడం అందరి వల్ల కాదన్నారు. ప్రతి సంఘటన పత్రికలు, మీడియాలో వార్తగా రావడం కుదరదన్నారు. కొన్ని చోట్ల ఇంటినుంచే కదలనివ్వలేదని చెప్పారు.
ఇప్పటికీ చాలా మందిని వైసీపీ నేతలు వారి ఇంటికివెళ్ళి బెదిరిస్తున్నారని తెలిపారు.
తాము నామినేషన్ దాఖలు చేయకుండా అడ్డుకున్నారని లేదా బలవంతంగా నామినేషన్ను వాపస్ తీసుకునేలా చేశారని అప్పట్లో పోలీసులకుగానీ, ఎన్నికల అధికారులకుగానీ ఫిర్యాదు చేసిన వారికి మాత్రమే ఈ అవకాశం కల్పిస్తామనడం కూడా న్యాయం కాదన్నారు.
భయపడిన వారిలో చాలామంది ఫిర్యాదులు కూడా చేయలేదన్నారు. కొన్నిచోట్ల పోలీసులే భయపెట్టి ఫిర్యాదులు స్వీకరించకుండా పంపేశారన్నారు.
ఇప్పుడు ఎన్నికల అధికారులు, కలెక్టర్లకు ఫిర్యాదు చేయనీయకుండా భయపెడుతు ఉన్నారని చెప్పారు. ఇలాంటి పరిస్తితులలో స్వీయ ప్రకటన ఆధారంగా నామినేషన్ వేయడానికి అవకాశం కల్పించాలని సూచించారు.
కాగా గతంలో నామినేషన్లు వేసినవారికి ఏడాదిపాటు ప్రచారం చేసుకోవడానికి అవకాశం దొరికిందని చెప్పారు.
ఇదికూడా రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధమన్నారు. పైగా పాలక పక్షం నేతలు రాష్త్రంలో రాజారెడ్డి రాజ్యాంగాన్ని అమలుచేస్తూ, అరాచకాలు సృష్టిస్తున్నారని ఆరోపించారు.
ఈ నేపథ్యంలో కొత్తగా నోటిఫికేషన్ ఇచ్చి స్వేచ్చాయుత వాతావరణం కల్పించి ఎన్నికలు జరపాలని సుధాకర్ రెడ్డి ఎస్ఈసిని కోరారు.