రాష్ట్రంలో జగన్ ప్రభుత్వం 20 నెలల్లో రూ.1.70లక్షల కోట్ల అప్పు చేసిందని తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు తెలిపారు. రాష్ట్రాన్ని అభివృద్ధి చెయ్యడం మాని ఎక్కడ దొరికితే అక్కడ అప్పు చేశారని ఆయన అన్నారు.
టీడీపీ ఆవిర్భవించి 40 ఏళ్లు పూర్తయిన సందర్భంగా మంగళగిరిలోని ఆ పార్టీ కేంద్ర కార్యాలయంలో నిర్వహించిన వేడుకల్లో చంద్రబాబు మాట్లాడారు. ఆదాయానికి మించి అప్పులు చేయడం దివాళా కాకపోతే మరేంటి? చేసిన పనులకు బిల్లులు చెల్లించకపోవడంతో రూ.70వేల కోట్ల బకాయిలు కూడా ఉన్నాయి.
సామాన్య ప్రజలు బతకలేని విధంగా అన్ని ధరలు పెంచేశారు అని ఆయన అన్నారు. ప్రత్యేక హోదా ఎందుకు సాధించలేకపోయారు? 28 మంది వైకాపా ఎంపీలు కేంద్రం నుంచి ఏం తెచ్చారో చెప్పాలి. రెండేళ్లలో ఉద్యోగాలు వచ్చే ఒక్క పరిశ్రమనైనా తెచ్చారా? కేసుల మాఫీ కోసం విశాఖ ఉక్కు పరిశ్రమను తాకట్టు పెట్టారు.
నాసిరకం మద్యం ద్వారా రూ.వేల కోట్లు దండుకుంటున్నారు. అసెంబ్లీ పెట్టి కనీసం బడ్జెట్ను కూడా ఆమోదింపజేసుకునే పరిస్థితిలో ఈ ప్రభుత్వం లేదు. ఇచ్చేది గోరంత.. దోచేది కొండంత. యువత మేలుకుని భవిష్యత్తు గురించి బాధ్యతతో ఆలోచించాలి’’ అని చంద్రబాబు పిలుపునిచ్చారు.