తెలుగుదేశం పార్టీ కార్యాలయంపై దాడి చేసిన వారిని ఇప్పటి వరకూ ఎవరిని అరెస్టు చేయలేదు కానీ ముఖ్యమంత్రిని వ్యక్తిగతంగా దూషించారనే ఆరోపణపై మాత్రం టీడీపీ అధికార ప్రతినిధి పట్టాభిని పోలీసులు అరెస్టు చేశారు. పట్టాభిని అరెస్ట్ చేసి విజయవాడలోని గవర్నర్ పేట పోలీస్ స్టేషన్ కు తీసుకువెళ్లారు. అరెస్టును ముందే ఊహించిన పట్టాభి తనపై లాకప్ లో పోలీసులు దాడి చేస్తారని ఊహించి ముందుగానే ఒక వీడియోను విడుదల చేశారు.
వై ఎస్ ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు, పార్లమెంటు సభ్యుడు కె. రఘురామకృష్ణరాజును ఇదే విధంగా ఏపి పోలీసులు అరెస్టు చేసి లాకప్ లో చిత్ర హింసలు పెట్టిన నేపథ్యంలో అలాంటి దాడి తనపై జరగకుండా ఉండేందుకు పట్టాభి ఈ వీడియోను విడుదల చేశారు. వీడియో తేదీ, సమయం కూడా చూపించిన పట్టాభి, తన ఒంటిపై ప్రస్తుతం ఎలాంటి గాయాలు లేవని చూపించారు.
పోలీసు కస్టడీలో తనకు ప్రాణహాని ఉందని పట్టాభి ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అందుకే ఈ వీడియో విడుదల చేస్తున్నట్టు పట్టాభి పేర్కొన్నారు. తాను ఎలాంటి తప్పు చేయలేదని కోర్టుపై తనకు పూర్తి నమ్మకం ఉందని వీడియోలో వెల్లడించారు. తనకు ఎలాంటి ప్రాణహాని జరిగినా పోలీసులదే బాధ్యత అని పట్టాభి అంటున్నారు.