కడప జిల్లాలోని మైదుకూరు నియోజకవర్గం లోని కోట్లాది రూపాయలు విలువ చేసే అటవీ భూములను వంద ఎకరాలను వైసీపీ ఎమ్మెల్యే రఘురామరెడ్డి, వైసీపీ మండల నాయకులు కబ్జా చేశారని టీడీపీ మైదుకూరు నియోజకవర్గ ఇంచార్జ్, టీటీడీ మాజీ ఛైర్మన్ పుట్టా సుధాకర్ యాదవ్ ఆరోపించారు.
దీనిపై చర్యలు చేపట్టాల్సిన ప్రభుత్వం ప్రోత్సహించే దిశగా వ్యవహరిస్తోందని మండి పడ్డారు. బుధవారం టీడీపీ ఆధ్వర్యంలో భూ ఆక్రమణలపై మీడియా పరిశీలన కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ సీఎం సొంత జిల్లాలో వైసీపీ నేతలు యథేచ్ఛగా భూ ఆక్రమణలు చేస్తున్నారని ఆయన ఆరోపించారు.
ప్రభుత్వం ప్రచారాలు చేయడంలో ఆర్భాటాలు ఆచరణలో కనబడకపోవడం కంచె చేను మేసిన విధంగా ఉందన్నారు. మైదుకూరు నియోజకవర్గంలో 100 ఎకరాల ప్రభుత్వ భూమిని స్థానిక ఎమ్మెల్యే రఘురామరెడ్డి ఆక్రమించి వ్యవసాయానికి అనుగుణంగా మార్చుకోవటమే కాక ఆక్రమిత భూమికి పెన్సింగ్ చేశారన్నారు.
మైదుకూరు నియోజకవర్గం లోని ఖాజీపేట మండలం మాచూపల్లె రెవెన్యూ పరిధిలోని సర్వే నెంబర్ 11 మైదుకూరు రూరల్ మండలం సర్వే నెంబర్లు 506, 507 వంద ఎకరాలు ఆక్రమించారన్నారు.
రాష్ట్ర ప్రభుత్వం కు చెందిన రిజర్వ్ ఫారెస్ట్ భూమిని ఆక్రమించిన ఎమ్మెల్యేను, సహకరించిన అధికారులపై చర్యలు తీసుకొని ప్రభుత్వం చిత్తశుద్ధి చాటాలన్నారు.
జిల్లా టీడీపీ ప్రధాన కార్యదర్శి హరి ప్రసాద్ మాట్లాడుతూ కరోనాను కట్టడి చేసి ప్రజల ప్రాణాలు కాపాడాల్సిన వైసీపీ నేతలు వారి సొంత ప్రయోజనాలకోసం ప్రభుత్వ భూమిని కబ్జా చేయడం దారుణమన్నారు. కబ్జా చేసిన ఆక్రమిత భూముల్లో బోర్లు ఎలా వేసుకున్నారని ప్రశ్నించారు.
ఆన్ రిజర్వ్డు అటవీ భూముల్లో విద్యుత్ ట్రాన్స్ఫార్మర్స్ ఎలా మంజూరు చేశారన్నారు. స్థానిక వైసీపీ నాయకులు వంద ఎకరాలు అక్రమిస్తే మిగతా నియోజక వర్గాల్లో ఆ పార్టీకి చెందిన చోటా నేతలు పేదలకు చెందిన భూములను అక్రమించుకుంటున్నారన్నారు.
ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకొని ప్రభుత్వ భూములను పరి రక్షించడంతో పాటు ప్రజా సంక్షేమం కోసం పాటు పడాలని హితవు పలికారు.
ఈ కార్యక్రమంలో టీడీపీ జిల్లా ఉపాధ్యక్షులు గన్నేపాటి మల్లేష్, సుధాకర్ రెడ్డి,మైదుకూరు మండల అధ్యక్షుడు మల్లికార్జున, టీడీపీ బీసీ నేత,రాష్ట్ర మత్స్య శాఖ కార్పొరేషన్ డైరెక్టర్ యాటగిరి రామ ప్రసాద్,మండల టీడీపీ నాయకులు రవీంద్ర, నాగ మహేష్ తదితరులు పాల్గొన్నారు.