శాంతియుతంగా బంద్ లో పాల్గొంటున్న తెలుగుదేశం పార్టీ శ్రేణులను పోలీసులు ఎక్కడిక్కడ అడ్డుకుంటున్నారు. గుంటూరు జిల్లా నరసరావుపేట నియోజకవర్గ టిడిపి ఇన్-ఛార్జ్ డా౹౹చదలవాడ అరవింద బాబును పోలీసులు అరెస్ట్ చేశారు. రాష్ట్ర బంద్ లో భాగంగా నరసరావుపేటలో టిడిపి నాయకులు ర్యాలీ నిర్వహించారు. బంద్ నిర్వహించేందుకు పార్టీ కార్యాలయం నుండి ఆర్టీసీ బస్టాండ్ కు ర్యాలీగా బయలుదేరిన టిడిపి నేతలను పోలీసులు ఓవర్ బ్రిడ్జి పై ర్యాలీని అడ్డుకున్నారు.
అరవింద బాబు పై పోలీసుల దౌర్జన్యం చేశారని తెలుగుదేశం కార్యకర్తలు ఆరోపించారు. అరెస్టు చేసిన అరవింద బాబును పోలీసు స్టేషన్ కు తరలించారు. అరవింద బాబు తో పాటు పలువురు టిడిపి నేతలను బలవంతంగా స్టేషన్ కు తరలించారు. నరసరావుపేట ఆర్టీసీ డిపో వద్ద టీడీపీ శ్రేణులు బస్సులను అడ్డుకున్నాయి. బస్సులు అడ్డుకున్న టీడీపీ కార్యకర్తలను రెండవ పట్టణ పోలీసు స్టేషన్కు తరలించారు.
ఆర్టీసీ బస్టాండ్ వద్ద పోలీసులు భారీగా మొహరించారు. తెలుగుదేశం కేంద్ర కార్యాలయం పై దాడి, అరవింద బాబు అరెస్ట్ కు నిరసనగా విభిన్న ప్రతిభావంతుల కార్పొరేషన్ మాజీ ఛైర్మన్ గోనుగుంట్ల కోటేశ్వరరావు రోడ్డుపై బైఠాయించారు. దాంతో కోటేశ్వరరావు ధర్నా ను పోలీసులు చెదరగొట్టారు. దీంతో నరసరావుపేటలో ఉద్రిక్తత వాతావరణం నెలకొన్నది. పోలీసుల తీరు పై గోనుగుంట్ల కోటేశ్వరరావు, కడియాల రమేష్, కొట్ట కిరణ్, దాసరి ఉదయ్ శ్రీ తదితర నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు.
నరసరావుపేట పట్టణ తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు కడియాల రమేష్, పార్లమెంట్ పార్టీ ప్రధాన కార్యదర్శి కొట్ట కిరణ్, కొల్లి బ్రహ్మయ్య తెలుగు యువత నాయకులు శాఖమూరి మారుతి లను అరెస్ట్ చేసి నకరికల్లు పోలీస్ స్టేషన్ కి తరలించారు. పులిమి రామిరెడ్డి, వెన్న బాల కోటిరెడ్డి తదితర కార్యకర్తలను అరెస్ట్ చేసి రొంపిచర్ల పోలీసు స్టేషన్ కి తరలించారు.